నిడదవోలు, జనవరి 7: ప్రధాని నరేంద్ర మోదీకి నందమూరి తారక రామారావు పేరు ఎత్తే అర్హత లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జన్మభూమి – మావూరు కార్యక్రమంలో భాగంగా సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా, నిడదవోలులో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. తన కుటుంబంపై మోదీ చేసిన విమర్శలపై స్పందిస్తూ, ఇది ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని చంద్రబాబు అన్నారు. తనకు ప్రధాని కావాలన్న ఆశ ఏమాత్రం లేదని బాబు స్పష్టం చేశారు.
‘ఎప్పటికీ ఢిల్లీకి ఊడిగం చేయం, నేను ప్రజల కోసం పని చేస్తున్నాను, కుటుంబం కోసం పని చేయడం లేదు. మనం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, సమిష్టి కృషి ఫలితంగా 670 అవార్డులు వచ్చాయి. ఇవి మన తెలివితేటలతో సాధించుకున్నాం. ప్రధాని మోదీకి దేశం ఏమైనా ఫరవాలేదు, ఈయన ఒక్కడే ఉండాలని కోరుకుంటాడు’ అని బాబు అన్నారు.
అవనీతి తక్కువ ఉండే రాష్ట్రాల్లో మనది మూడవ స్థానం, అవినీతిని పూర్తిగా నిర్మూలించే లక్ష్యంగా పని చేస్తున్నాం. మనిషి మనిషిగా బతకాలి, యాంత్రీకరణతో పని చేస్తే సంపద వస్తుంది కానీ ఆనందం ఉండదు అని అన్నారు. పేదలకు అండగా ఉండాలని సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. విద్య, ఆరోగ్యం, పౌర సేవలు సులభతరం చేశాం. ఉదారంగా కార్పోరేషన్ల ద్వారా రుణాలు, ఆదరణ పథకం కింద ఆధునిక పనిముట్లు అందిస్తున్నామని అయన చెప్పారు.
పోలవరం ప్రాజెక్టు మే నెలకు పూర్తి చేసి గ్రావిటీతో నీరు ఇచ్చి తీరుతాం. డిసెంబర్లోగా పనులు మొత్తం పూర్తి చేసి జాతికి అంకితమిస్తాం.
దేశంలో ఇంత ప్రాజెక్టు మళ్లీ రాదు, ఒకే రోజు ఎక్కువ కాంక్రీట్ వేసిన ప్రాజెక్టుగా చరిత్రలో నిలిచిపోతుంది.
ఒక పక్క ఈ ప్రాజెక్టుకు అవార్డులు ఇస్తారు, మరో పక్క విమర్శలు చేస్తుంటారు ఇది వారి తీరు అని చంద్రబాబు అన్నారు.
జిల్లాలో మరో రెండు ఎత్తి పోతల పథకాలు చింతలపూడి, తాటిపూడి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి అన్నారు.
2022లోపు పేదలందరికీ ఇళ్లు కట్టించి, వారి సొంటింటి కల సాకారం చేస్తామని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రగతికి ప్రతి ఒక్కరి సహకారం, మద్దతు అందించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేసారు.