శిరోముండనం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ నిర్మాత, బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడుకు కేసుల ఉచ్చు బిగుసుకుంటున్నది. నూతన్ నాయుడుపై మరో కేసు కూడా నమోదు అయ్యింది. తన పేరు చెప్పి అధికారుల నుండి సహాయం పొందేందుకు నూతన్ నాయుడు ప్రయత్నించారని ఏపి సిఎంఒ అడిషనల్ చీఫ్ సెక్రటరీ పి వి రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఆయన భార్య మధు ప్రియ, వారి ఇంట్లో పని చేసే వారు శిరోముండనం కేసులో సాక్షాధారాలతో పట్టుబడగా వారిని రిమాండ్ కు తరలించారు. ఈ ఘటన తరువాత నూతన్ నాయుడు ముంబాయికి పారిపోతుండగా కర్నాటక రాష్ట్రం ఉడిపిలో గురువారం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
నూతన్ నాయుడు ఏమి చేశాడంటే…
ఆగస్టు 29న ఏపి సిఎంఒ అడిషనల్ చీఫ్ సెక్రటరీ పివి రమేష్ పేరు చెప్పి, ఆయన మాటలను అనుకరిస్తూ ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ కు ఫోన్ చేసి ఒక పేషంట్ ను పంపిస్తున్నాను, 15 రోజుల పాటు ట్రీట్మెంట్ ఇవ్వాలని ఆదేశించాడు. దీనిపై అనుమానం వచ్చిన ప్రిన్సిపాల్ సుధాకర్ నేరుగా పివి రమేష్ కు ఫోన్ చేసి విషయాన్ని తెలియజేశారు. దీనితో ఎవరో తన పేరు ఉపయోగిస్తూ అధికారులకు ఫోన్ చేసి డబ్బులు, ఇతర ప్రయోజనాలు డిమాండ్ చేస్తున్నట్లు తెలుసుకున్న పివి రమేష్ వెంటనే డీజిపి గౌతమ్ సవాంగ్, అడిషనల్ డిజిపి, విశాఖ సిపికి ఫిర్యాదు చేశారు. ఆ ఫోన్ నెంబర్ హైదరాబాద్ అడ్రస్ ఉందని విచారణలో తేలింది. ట్రూకాలర్ ద్వారా పరిశీలిస్తే అడిషనల్ సిఎస్ సిఎం అని వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై స్పందించిన పివి రమేష్ తన పేరుతో నూతన్ నాయుడు అధికారులకు ఫోన్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. తన పేరు ప్రఖ్యాతులను నాశనం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన్ నాయుడు చేసింది చాలా తీవ్రమైన నేరంగా అభివర్ణించారు పివి రమేష్.
విశాఖ జిల్లా పెందుర్తి లో శ్రీకాంత్ అనే యువకుడిపై సెల్ ఫోన్ చోరీ అభియోగం మోపిన నూతన్ నాయుడు భార్య ఇంట్లో పని వారి సహాయంతో అతన్ని తీవ్రంగా కొట్టడంతో పాటు శిరోముండనం చేశారు. ఈ ఘటన మొత్తం సిసి టీవిలో రికార్డు అయ్యింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు నూతన్ నాయుడు భార్య మధు ప్రియతో పాటు ఆమెకు నేరంలో సహకరించిన ఏడుగురు నిందితులను అరెస్టు చేసి జ్యూడిషియల్ రిమాండ్ కు తరలించారు. ఈ ఘటన సమయంలో ఇంట్లో నూతన్ నాయుడు లేకపోయినా శిరోముండనం చేస్తున్న సమయంలో ఒక మహిళ వీడియో కాల్ చేసి అక్కడ జరిగింది మొత్తం చూపించింది. పోలీసుల దర్యాప్తులో నూతన్ నాయుడు ప్రమేయం కూడా ఉన్నట్లు గుర్తించి గాలింపు చర్యలు చేపట్టగా ముంబాయి పరారు అవుతున్నట్లు తెలుసుకుని ఉడిపిలో నూతన్ నాయుడును అరెస్టు చేసి విశాఖకు తరలించారు. ఈ కేసులో అరెస్టు అయిన కొద్ది గంటల్లోనే నూతన నాయుడుపై రిటైర్డ్ ఐఎఎస్ పివి రమేష్ పేరుతో అధికారులకు ఫోన్ లు చేస్తున్న విషయం వెలుగులోకి రావడం, ఆ కేసు నమోదు కావడం గమనార్హం.