బుల్లెట్ కిక్ కొట్టాడంటే.. ఆ సౌండ్ తాలూకు శబ్దం బండి సైలెన్సర్ లో కాదు.. అతని ముఖంలో కనబడేది. అన్నా.. కష్టంలో ఉన్నామంటూ కార్మికులు అంటే.. తమ్ముడు నేనున్నా అంటూ ఆసరా ఇచ్చేవాడు.. 50 ఏళ్ల క్రితం ఎంతటి ధీరత్వం ఉందో 86 ఏళ్ల వయసులోనూ అదే ధీరత్వం. ఆ మీసం ఎప్పుడూ కిందికి దిగలేదు. ఆయనే.. నాయిని నరసింహారెడ్డి. కార్మిక నాయకుడిగా కార్మికుల ఆశాజ్యోతిగా బతికిన నాయిని ఇప్పుడు లేరు. అనారోగ్యంతో పోరాడి 86 ఏళ్ల వయసులో తన వాళ్లను, కార్మికులను, పార్టీని వదిలివెళ్లిపోయారు. గంభీరమైన ఆయన ముఖం.. పైకి మెలితిప్పి ఉండే ఆయన మీసం.. ఒక యోధుడి పౌరుషం ఒక చరిత్రగా మిగిలిపోయింది.
కార్మిక నాయకుడిగా.. సమస్యలకు బాసటగా..
1934లో నల్గొండ జిల్లా దేవరకొండ ఏరియాలో నేరేడుగొమ్ములో సాధారణ రైతు కుటుంబంలో నాయిని జన్మించారు. హెచ్ ఎస్సీ వరకూ చదువుకున్నారు. కార్మిక నాయకుడిగా ఎదిగారు. లేబర్ సమస్యలే తన అజెండాగా తిరిగారు నాయిని. అప్పట్లో హైదరాబాద్ లో కార్మికుల తరపున మాట్లాడేది, వారి సమస్యలపై గళమెత్తింది నాయిని మాత్రమే. 50 ఏళ్ల క్రితం వీఎస్టీ ఇండస్ట్రీస్ లో కార్మిక నాయకుడిగా ఆయన ఎలా ఉన్నారో.. మంత్రిగానూ ఆయన గొంతు అలానే వినిపించారు. కార్మిక వాసననే ఊపిరిగా బతకడమంటే మామూలు విషయం కాదు.
అందుకే కేసీఆర్ కన్నీళ్లు పెట్టుకున్నారు..
1969 నాటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. అప్పుడు సాధించలేనిది మలి తెలంగాణ ఉద్యమంలో సాధించాలని కేసీఆర్ కు వెన్నంటి నడిచారు. టీఆర్ఎస్ జెండా మోసారు. రాష్ట్రం సాధించారు. తొలి ప్రభుత్వంలో హోంమంత్రి అయ్యారు.. కష్టపడిన పార్టీలో కొన్నాళ్లుగా కాస్త అసంతృప్తి. అల్లుడికి ఎమ్మెల్యే సీటు ఇప్పించుకోలేక పోవడం.. పార్టీనే వదిలి వెళ్లిపోతారని వ్యాఖ్యలు.. ఇలా పలు రకాలుగా సాగింది ఆయన చివరి రాజకీయ దశ. కానీ.. నాయిని త్యాగాలను సీఎం కేసీఆర్ మర్చిపోలేదు. తనను నమ్మి నడిచిన నాయిని పరిస్థితికి చలించిపోయారు. కార్మికుల కోసం తెలంగాణ కోసం ఆయన చేసిన పోరాటం కేసీఆర్ కు తెలుసు. అందుకే కేసీఆర్ కంట కన్నీరు. ఏదేమైనా.. కార్మికలోకంలో.. టీఆర్ఎస్ లో.. మొత్తంగా తెలంగాణలో నాయిని ఓ వెలుగు దివ్వె..!