ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు వస్తుంటాయి,పోతుంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్ను మోడల్ స్టేట్గా తీర్చిదిద్దే సత్తా చంద్రబాబుకే ఉందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్నారు. కేజ్రీవాల్ గురువారం రాష్ట్రంలో పలు చోట్ల టిడిపికి మద్దతుగా చంద్రబాబుతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
టిడిపిని మంచి మెజారిటీతో గెలిపించాలని కోరేందుకే రాష్ట్రానికి వచ్చానని కేజ్రీవాల్ అన్నారు. 25 ఎంపి సీట్లలో టిడిపిని గెలిపించి కేంద్రంలో బాబు చక్రం తిప్పేలా చేయాలని కేజ్రీవాల్ కోరారు. దేశం అభివృద్ధి చెందాలంటే మోదీని ఓడించాలనీ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే చంద్రబాబును గెలిపించాలనీ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లగలిగిన నాయకుడు చంద్రబాబు అని కేజ్రీవాల్ కొనియాడారు. విభజన వల్ల ఆర్ధిక కష్టాలు వచ్చినా చంద్రబాబు అభివృద్ధి చేసి చూపారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. దేశంలో ఎవరూ చేయని విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసారని కేజ్రీవాల్ అన్నారు. రైతులు, మహిళలు, వృద్దులు అన్ని వర్గాల వారి సంక్షేమం కోసం అనేక పధకాలు అమలు చేశారని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
జగన్కు ఓటేస్తే బిజెపికి వేసినట్లేనని ప్రజలు గుర్తించాలని కేజ్రీవాల్ అన్నారు. మనం ఐక్యంగా ఉంటే ఈ దేశం సురక్షితంగా ఉంటుందనీ, మనం ఒక్కతాటిపై ఉంటే అనుకున్నది సాధించగలుగుతామనీ కేజ్రీవాల్ స్పష్టం చేశారు.