కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఎన్నికల ముందు వరకూ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఎదురు లేదు, తిరుగులేదు. టీడీపీలో ఆయన ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే. ఎన్నికలకు ముందే ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి వైసిపి నుండి చేరికకు పిలుపు వచ్చింది. ఆ పిలుపును వంశీ లైట్ గా తీసుకున్నాడు. హైదరాబాదులోని ఒ స్థల వివాదాన్ని సమస్యగా చూపి వైసీపీలో చేరాలని ఆయనపై తీవ్ర ఒత్తడీ తీసుకువచ్చారు. అయినా వంశీ ససేమిరా అన్నాడు. ఈ విషయాలు నాడు మీడియాల్లోనూ వచ్చాయి. అయితే ఎన్నికలకు ముందు వంశీ వెళ్లకూడదు అనుకున్న పార్టీ రాష్ట్రంలో అఖండ మెజార్టీతో విజయం సాధించింది. టీడీపీ ఘోర పరాజయం చవి చూసింది. వైసీపీ ఫ్యాన్ గాలిలో సైతం వల్లభనేని వంశీ మాత్రం గన్నవరం నియోజకవర్గంలో గెలిచాడు. తన సమర్థత, సత్తాను చాటుకున్నారు. కానీ ఉపయోగం ఏమి ఉంది టిడిపి అధికారంలో లేదు. ఏమి చేయాలన్నా ఇబ్బందే. దీనికి తోడు కేసులు ఎదుర్కోవాల్సి రావడం సమస్యగా పరిణమించడంతో అధికార పార్టీ వైసిపికి దగ్గర అయ్యాడు వల్లభనేని వంశీ. ప్రస్తుతం చేరిన పార్టీలో వల్లభనేని వంశీ హ్యాపీగా ఉన్నాడా అంటే అదీ లేదు. ఆ పార్టీలో ఒంటరిగా మిగిలిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
మున్నాళ్ల ముచ్చటైన సయోధ్య
ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీలోకి చేరక ముందే నుండే గన్నవరం నియోజకవర్గంలో ఆ పార్టీలో రెెండు బలమైన గ్రూపులు ఉన్నాయి. వంశీ వైసీపీలో చేరికను ఆ నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జి యార్లగడ్డ వెంకట్రావు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ నియోజకవర్గంలో రెండవ గ్రూపుకు నేతృత్వం వహిస్తున్న సీనియర్ వైసీపీ నేత దుట్టా రామచంద్రరావు నాడు వంశీ రాకను స్వాగతించారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలకు గన్నవరం సమస్య పరిష్కార బాధ్యతలను అప్పగించారు. దీంతో వారు యార్లగడ్డ తో చర్చలు జరిపి చివరకు కెడిసిసి చైర్మన్ పదవి యార్లగడ్డకు అప్పగించి శాంతింపజేశారు. వంశీని అనధికారికంగా పార్టీలో చేర్చుకున్నారు. అక్కడి వరకూ బాగానే ఉంది. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమిటంటే ఒక వరలో రెండు కత్తులు ఇమడవు అన్న సామెత ఉంది. ఇక్కడ మూడు కత్తులు ఉన్నాయి. వారి మధ్య సయోధ్య ఎలా కొనసాగుతుంది. ఆ నాయకుల మధ్య సయోధ్య కూడా మూడు నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది.
సమస్య ఎక్కడ రాజుకుంది అంటే…
టిడీపీపై దూకుడుగా వ్యవహరించాలంటే ఆ పార్టీ భిఫాం ద్వారా గెలిచిన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి వైసీపీ ద్వారా గెలవాలని భావిస్తున్నారు వల్లభనేని వంశీ. ఈ క్రమంలో భాగంగా తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేస్తానంటూ వల్లభనేని వంశీ ఇటీవల ప్రకటించారు. ఈ ప్రకటన నేపథ్యంలో అప్పటి వరకూ వంశీకి కాస్తోకూస్తో అనుకూలంగా ఉన్న సీనియర్ వైసీపీ నేత దుట్టా రామచంద్రరావు కూడా వంశీకి దూరం అయ్యారు. పదేళ్ల నుండి తాము వైసీపీలో పని చేస్తున్నామనీ, నిన్న కాక మున్న పార్టీలోకి వచ్చిన వ్యక్తి ఇష్టానుసారంగా నియోజకవర్గంలో వ్యవహరించడం ఏమటి అంటూ దుట్టా రామచంద్రరావు ఫైర్ అయ్యారు. కార్యకర్తల అభీష్టం మేరకు పార్టీ అధినేత అదేశిస్తే తానే ఎమ్మెల్యే అభ్యర్థినంటూ దుట్టా పేర్కొన్నారు. నియోజకవర్గంలో వంశీ ఆధిపత్యాన్ని దుట్టా వర్గీయులు వ్యతిరేకిస్తున్నారు.
వైసీపీలో బహిర్గతమైన విభేధాలు
మొన్న గన్నవరం నియోజకవర్గంలో జరిగిన ఒ సంఘటనతో వైసీపీలోని వర్గ విభేదాలు బహిర్గతం అయ్యాయి. యార్లగడ్డ వెంకట్రావు, వల్లభనేని వంశీ వర్గీయుల మధ్య నెలకొన్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారి పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా, జాాతీయ రహదారిపై రాస్తోరోకో వరకూ దారి తీశాయి. యార్లగడ్డ వర్గానికి చెందిన వినయ్ మేనల్లుడు చిన అవుటుపల్లిలో ఒక చెరువును లీజుకు తీసుకున్నాడు. ఆ నీటిని వృధా కాకుండా పొలంలోని గడ్డి సాకుకు మళ్లించాడు. ఈ వ్యవహారంపై అదే గ్రామానికి చెందిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరుడు దుర్గారావు, యార్లగడ్డ అనుచరుడు వినయ్ మద్య వివాదం జరిగింది. వీరి మధ్య మాటా మాటా పెరగడంతో ఘర్షణ పడ్డారు. ఇరువర్గాలు అత్కూరు పోలీస్ స్టేషన్ లో ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నారు. విషయం తెలియడంతో కెసిసిసి బ్యాంక్ చైర్మన్ యార్లగడ్డ వెంకట్రావు నేరుగా ఆత్కూరు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని తన వర్గీయులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యార్లగడ్డ వర్గీయులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ స్టేషన్ వద్దే జాతీయ రహదారిపై ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. ఇది జరిగిన కొద్దిసేపటికే దుట్టా రామచంద్రరావు కూడా స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఇక్కడ జరిగిన విషయాన్ని ముఖ్యమంత్రి, పార్టీ సీనియర్ నాయకుల దృష్టికి తీసుకువెళతానని దుట్టా పేర్కొన్నారు.
వంశీ ఏకాకి అయినట్లేనా?
గన్నవరంలో నియోజకవర్గంలో ఎమ్మెల్యే వంశీని ఏకాకిని చేసే ప్రయత్నంలో యార్లగడ్డ, దుట్టా వర్గీయులు ఏకం అవుతున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. వంశీని పూర్తిగా వ్యతిరేకిస్తున్న దుట్టా రామచంద్రరావు ఆత్కూరు పోలీస్ స్టేషన్ వద్దకు రావడం, పరిస్థితులను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుుకువెళతామని చెప్పడం చూస్తుంటే యార్లగడ్డకు మద్దతు ఇస్తున్నట్లు అర్థం అవుతుంది అంటున్నారు. నియోజకవర్గంలో వేగంగా జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో దుట్టా, యార్లగడ్డ వర్గీయులు ఏకమైతే వంశీ ఏకాకి అయినట్లేనని పేర్కొంటున్నారు. ఇక్కడి గ్రూపు రాజకీయాలు పార్టీ అధిష్టానానికి తలనొప్పులు తెప్పించేదిగా తయారు అంటున్నారు. వీటిపై పార్టీ అధిష్టానం, వంశీ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.