ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చర్యపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, నారా లోకేష్ విషయంలో పోలీసుల చర్య హాట్ టాపిక్గా మారింది.
ఆయనపై కోవిడ్ నిబంధనల ఉల్లంఘనలను పేర్కొంటూ పోలీసు కేసు నమోదు అయింది. అయితే, ఈ విషయంలో జగన్ సర్కారు తీరుపై తెలుగుదేశం విరుచుకుపడింది. ఇదే సమయంలో జగన్ సర్కారు నిర్ణయంపై రాజకీయ విమర్శకులు కొత్త విశ్లేషణ చేస్తున్నారు.
వైసీపీ నేతలకే రూల్స్ వర్తిస్తాయా?
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, రైతుల వెతలను తన గొంతుకతో వినిపించాడనే లోకేష్పై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. కోవిడ్ నిబంధనలు, చట్టాలు అనేవి ప్రతిపక్ష పార్టీలకు మాత్రమే వర్తిస్తాయా? అధికార పార్టీకి వర్తించవా? అని అన్నారు. రాజప్రాసాదాల్లో, బంగ్లాల్లో కూర్చొనే ముఖ్యమంత్రి , మంత్రులకు నీళ్లలో మగ్గుతున్న రైతుల కష్టాలు ఎలా తెలుస్తాయని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర రైతాంగానికి భరోసా ఇచ్చేలా, అన్నదాతల సమస్యలను ప్రభుత్వానికి వినిపించేలా చెప్పినందుకే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, లోకేశ్ పై తప్పుడు కేసులు పెట్టించిందని ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు వర్తించని కోవిడ్ నిబంధనలు లోకేశ్ కు మాత్రమే ఎలా వర్తిస్తాయో డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రోజా అంబులెన్స్ నడిపినప్పుడు, ఉండవల్లి శ్రీదేవి, బియ్యపు మధుసూదన్ రెడ్డి ట్రాక్టర్ ర్యాలీలు నిర్వహించినప్పుడు పోలీసులు ఏం చేశారు?
లోకేష్పై అందుకే కేసులు
రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్ పథకానికి జగన్మోహన్ రెడ్డి మంగళం పాడుతున్న విధానాన్ని లోకేశ్ ఎండగట్టినందునే ఆయనపై అక్రమ కేసులు పెట్టించారని నారా లోకేష్ అన్నారు. రాష్ట్ర మంత్రులు రైతులను ఉద్దేశించి మాట్లాడే బూతుల భాషను, మంత్రుల వ్యాఖ్యలను రైతులకు అర్థమయ్యేలా చెప్పడమే లోకేష్ చేసిన నేరమా అని నిమ్మల నిలదీశారు. పశ్చిమగోదావరి జిల్లాకు కేవలం రూ.కోటి40లక్షల ఇన్ పుట్ సబ్సిడీని మాత్రమే ప్రభుత్వం విడుదలచేసిందని, ఆ సొమ్ము మొత్తం కేవలం 2వేలఎకరాలకు మాత్రమే ఇవ్వడం జరిగిందన్నారు. 4లక్షల ఎకరాలకు ఇన్ పుట్ సబ్సిడీ రావాల్సి ఉండగా, ఒక జిల్లాకు కేవలం 2వేల ఎకరాలకు ఇవ్వడమేంటని నిమ్మల మండిపడ్డారు. అదే అంశంపై లోకేశ్ వైసీపీ ప్రభుత్వాన్ని రైతుల సమక్షంలో నిలదీశారన్నారు. కాగా, లోకేష్పై కేసు నమోదు ద్వారా జగన్ సర్కారు తనను తాను ఇరకాటంలో పడేసుకుందని అంటున్నారు.