సీఎం జగన్ మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఈనెల 8వ తేదీన జరగనుంది. జగన్ ఏడాది పాలనలో దాదాపు ఆరు నెలల పాటు ఇళ్ల పట్టాల పైన చాలా సార్లు సమీక్ష చేశారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ లను కూడా వారానికొకసారి ఆరా తీస్తూ ఒకరకంగా వెంటాడి మరీ ఈ పథకాన్ని అమలు చేయాలని తలచారు. ఈ నేపధ్యంలోనే పలువురు కలెక్టర్ ల పై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. అన్ని తట్టుకున్న కలెక్టర్లు ఈ నెల 8 తో కాస్త రిలీఫ్ అవ్వనున్నారు. నిజానికి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ముందు నుంచి సీఎం జగన్ చెప్పినట్లు ఉగాది నాటికి జరగాల్సి ఉంది అంటే మూడు నెల కిందట ఈ పంపిణీ కార్యక్రమం పూర్తి చేయాల్సి ఉంది. కానీ కరోనా అడ్డుకోవడంతో వాయిదా పడుతూ చివరకు వైఎస్ జయంతి నాడు అందుకు వేదిక అయింది.
ఇక ఈ ముఖ్యమైన తంతు ముగిసిన వెంటనే జగన్మోహన రెడ్డి పాలనలో మరో ముందడుగు వేసేందుకు కసరత్తు చేస్తున్నారు. జిల్లాల విభజన పై ఆలోచిస్తున్నట్టు, కలెక్టర్ల నుంచి నివేదిక తప్పించుకున్నట్లు తెలుస్తోంది దసరా నాటికి లేదా వచ్చే సంక్రాంతి నాటికి జిల్లాల ను విభజించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి దగ్గర ఒక ప్రతిపాదన సిద్ధమైంది అంటే జగన్ రెండేళ్ల పరిపాలన పూర్తి అయ్యేలోగా జిల్లాల విభజన పూర్తయి రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల సంఖ్య పెరిగితే తర్వాత దశలో రెండేళ్ల తర్వాత పరిపాలనను మరో దశకు తీసుకువెళ్ళవచ్చు అనేది సీఎం జగన్ ఆలోచన. అందుకు తగ్గట్టుగానే ముందు నుంచి తాను హామీ ఇచ్చినట్లు ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేసేందుకు ప్రాథమికంగా సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. కానీ కొన్ని చోట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండడం , భౌగోళిక పరిస్థితులు, జనాభా దృష్ట్యా ఈ నిర్ణయం మార్పు చేసుకుని కొన్ని జిల్లాల్లో మార్పులు చేయాలని యోచిస్తున్నారట.
జూలై 8 తర్వాత కలెక్టర్లను జిల్లాస్థాయి అధికారులు కొందరు జిల్లాలో విభజనపై దృష్టి పెట్టి ఆ నివేదికలు తెప్పించుకొని పనిలో ఉన్నారని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలోని తీసుకుంటే పార్లమెంటరీ జిల్లా గా చేయాలి అంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పు గోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాలు ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. జిల్లా కేంద్రం శ్రీకాకుళం జిల్లా పాలకొండ నుంచి తూర్పుగోదావరి జిల్లా వరకు వెళ్ళవలసి వస్తుంది. ఇది కష్టమైన పని. అలాగే ప్రకాశం జిల్లాలో కూడా బాపట్ల పార్లమెంటు పరిధిలో అద్దంకి, సంతనూతలపాడు, చీరాల, పర్చూరు నియోజక వర్గాలు ఉన్నాయి. సంతనూతలపాడు నుండి బాపట్ల వెళ్లాలంటే అది కష్టతరం అవుతుంది. అదే సంతనూతలపాడుకు పది కిలోమీటర్ల దూరంలో ఒంగోలు ఉంది. అలాగే కర్నూలు, అనంతపురంలో కూడా ఇదే తరహా పరిస్థితులు ఉన్నాయి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గాలను జిల్లాలుగా చేయాల్సి వస్తే భౌగోళికంగాచాలా ఇబ్బందులు వస్తాయి. అందుకనే జిల్లాస్థాయిలో కలెక్టర్లు, అధికారులు, జేసీల ద్వారా కమిటీలను నియమించి జిల్లాల నుండి ప్రతిపాదనలు తీసుకొని జిల్లాల విభజన పై దృష్టి పెడతారని ఒక వర్గం చెబుతోంది. ఇదే సందర్భంలో కొంత మంది కలెక్టర్లు ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా తమను బదిలీ చేయాలని కోరారట. నెల్లూరు జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు, అనంతపురం జిల్లా కలెక్టర్, చిత్తూరు జిల్లా కలెక్టర్ వీళ్ళందరూ స్థానిక రాజకీయ వత్తిడులు నేపథ్యంలో తమను బదిలీ చేయాలని గడిచిన రెండు నెలల నుంచి ఉన్నత అధికారుల చుట్టూ తిరుగుతున్నారుట. జూలై 8 ఇళ్ల పట్టాల పంపిణీ తర్వాత ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలు ఉంటాయని, అప్పటి వరకు వేచి చూడాలని ఉన్నతాధికారులు సమాధానం చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇళ్ల పట్టాల పంపిణీ తర్వాత కలెక్టర్ ఎస్పీల బదిలీలు కూడా ఉంటాయని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. కీలకమైన జిల్లాలను వదిలేసి మిగిలిన జిల్లాల్లో మాత్రం అధికారులు నాయకులు సిఫార్సుల మేరకు కొన్ని బదిలీలు అయితే ఉంటాయని సమాచారం. బదిలీలు జరిగిన తర్వాత జిల్లా విభజనపై పూర్తిస్థాయిలో ఒక స్పష్టత రానుంది