వైసిపి అధినేత జగన్ అతి త్వరలోనే తన మకాం నవ్యాంధ్ర రాజధాని అమరావతికి మార్చనున్నారు. ఈ మేరకు గుంటూరు జిల్లా తాడేపల్లిలో జగన్ నివాసం కోసం నూతన గృహ నిర్మాణం పూర్తికావొచ్చింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఫిబ్రవరి 14వ తేదీన జగన్ కుటుంబం గృహప్రవేశం చేసే అవకాశముందని తెలుస్తోంది. అంతేకాదు ఇప్పటి వరకూ హైదరాబాద్ లో ఉన్న వైసిపి కేంద్ర కార్యాలయం కూడా ఇక్కడకే తరలిరానుంది. నూతనంగా నిర్మించిన జగన్ నివాసం ప్రాంగణంలోనే జగన్ ఆఫీస్ కోసం ప్రత్యేక కార్యాలయం నిర్మించారు.
ఎకరం 90 సెంట్ల విస్తీర్ణంలో ఈ రెండు నిర్మాణాలు చేపట్టగా ప్రస్తుతం ఈ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ముందుగా ఎపి సీఎం చంద్రబాబు నాయుడు, ఆ తరువాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నవ్యాంధ్ర రాజధానిలో నివాసం ఏర్పరుచుకోగా వారి బాటలోనే కొంత ఆలస్యంగా ప్రతిపక్ష నేత జగన్ తన మకాన్ని ఇక్కడకు మారుస్తున్నారు. చంద్రబాబు నివాసం ఉండవల్లి కృష్ణా నది పరివాహక ప్రాంతం పరిధిలో ఉండగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాసం నాగార్జున వర్శిటీ సమీపంలోని కాజ గ్రామంలో ఉంది. వైసిపి అధినేత జగన్ నూతన నివాసం జరిగిన ప్రాంతం మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉంది. జగన్ తన ఇల్లు,నివాసం విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించి తమ పార్టీకి గట్టి పట్టు ఉన్న ప్రాంతంలోనే వాటిని నిర్మించుకున్నారని భావిస్తున్నారు.
అసలు 2019 నూతన సంవత్సరం ఆరంభ నెల జనవరిలోనే జగన్ ఈ నూతన గృహంలోకి ప్రవేశిస్తారని తొలుత వార్తలు వచ్చాయి. అయితే నిర్మాణ పనులు పూర్తి కానందున మరికొంత ఆలస్యంగా అంటే ఫిబ్రవరి నెల రెండో వారంలో జగన్ గృహ ప్రవేశం ఉండొచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదిలావుంటే రాష్ట్ర విభజన జరిగి దాదాపు నాలుగున్నర సంవత్సరాలు గడుస్తున్నా పొరుగు రాష్ట్రం నుంచే పార్టీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారంటూ ప్రత్యర్థి పార్టీల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న వైసిపి ఇకపై వాటి నుంచి తప్పించుకోనుంది.
ఇప్పటివరకూ హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో జగన్ నివాసం ఉంటుండగా, వైసిపి ప్రధాన కార్యాలయం కూడా అక్కడే ఉన్న సంగతి తెలిసిందే. దీంతో పార్టీ తరుపున అధికార ప్రతినిధులు దాదాపు ఇక్కడి నుంచే మాట్లాడేవారు. దీంతో పార్టీ నేతల నివాసాలన్నీ ఆంధ్రాలో ఉండగా జగన్ ను కలవాలన్నా, పార్టీ కేంద్ర కార్యలయానికి వెళ్లాలన్నా హైదరాబాద్ వెళ్లాల్సిరావడం వారికి ఇబ్బందిగా ఉండేది. అయితే ఇకపై జగన్ నివాసం, పార్టీ కార్యాలయం తాడేపల్లికి షిఫ్ట్ అవుతుండటంతో వారికి సౌలభ్యం చేకూరనుంది. మరోవైపు జగన్ కూడా కోర్టు కేసులకు హజరుకావడం కోసం హైదరాబాద్ వెళ్లడం మినహా మిగతా పూర్తి సమయం ఇక్కడి నుంచే పార్టీ కోసం వెచ్చించనున్నారని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.