Lagadapati TDP: ఏపిలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉన్నప్పటికీ ప్రధాన రాజకీయ పక్షాలు అన్నీ రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుండి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. పార్టీలు యాక్టివ్ అవుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీలో అభ్యర్ధుల ఎంపికపై కొత్త పేచీలు వస్తున్నాయి. ప్రధానంగా విజయవాడలో అభ్యర్ధుల కేటాయింపు టీడీపీకి పెద్ద సమస్యగా తయారు అవుతోంది. విజయవాడ ఎంపీగా రెండు సార్లు గెలిచి, కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పని చేసిన లగడపాటి రాజగోపాల్, తన వారసుడితో కలిసి టీడీపీలో చేరేందుకు సిద్ధం అవుతున్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ తరపున ఆయన గానీ ఆయన కుమారుడు గానీ పోటీ చేయాలని భావిస్తున్నారు. టీడీపీ కూడా వారికి ఒక సీటు ఇవ్వడానికి సిద్ధం అవుతుంటే.. వీళ్లు వేరే సీటు అడుగుతుండటంతో టీడీపీకి కొత్త పేచీ వచ్చిపండింది. లగడపాటి రాజగోపాల్ గతంలో విజయవాడ ఎంపిగా పని చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆయన రాజకీయ సన్యాసం తీసుకున్నారు. తరువాత తప్పుడు ఎన్నికల సర్వే ఫలితాలు చెప్పి అభాసుపాలైయ్యారు. అనంతరం పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు ఆయన క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నారు.
Lagadapati TDP: గన్నవరం.. విజయవాడ ఎంపీ..!?
రాజగోపాల్ తనకు గానీ తన కుమారుడికి గానీ విజయవాడ ఎంపీ సీటును అడుగుతున్నారు. అయితే పార్టీ మాత్రం వాళ్లకు గన్నవరం అసెంబ్లీ నుండి పోటీ చేయమని ప్రతిపాదిస్తున్నదట. గన్నవరం నుండి పోటీ చేయడానికి అంత సుముఖత వ్యక్తం చేయడం లేదు. లగడపాటికి గన్నవరంలో సొంత వర్గం ఉన్నప్పటికీ అక్కడ టీడీపీ తరపున పోటీ చేస్తే గెలుస్తామా లేదా అన్న అనుమానాల నేపథ్యంలో అక్కడ పోటీకి మొగ్గు చూపడం లేదు. అయితే విజయవాడ తూర్పు అసెంబ్లీ గానీ లేక విజయవాడ ఎంపీ స్థానం గానీ ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. ఎంపిగా చేసి ఉండటంతో పాటు విజయవాడ పరిధిలో తన కుంటూ కొంత వర్గం ఉండటంతో విజయవాడ ఎంపి, లేదా తూర్పు సీటే అడుగుతున్నారని తెలుస్తోంది. లగడపాటికి విజయవాడ ఎంపి సీటు ఇవ్వాలంటే సిట్టింగ్ ఎంపి కేశినేని నానికి ఎలా సర్దుబాటు చేయగలరు? ప్రస్తుతం ఆయన విజయవాడ పశ్చిమ కో ఆర్డినేటర్ గా ఉన్నారు. కానీ అక్కడ నుండి పోటీ చేయడానికి సిద్ధంగా లేరు. ఈ నియోజకవర్గంలో మైనార్టీ ముస్లిం, కాపు, బీసీ సామాజికవర్గ ఓట్లు ఎక్కువ. కేశినేని నాని అక్కడ పార్టీ సమన్వయం చేయడానికి ప్రయత్నిస్తారు తప్ప పోటీ చేయడానికి ఆయన గానీ ఆయన కుమార్తె శ్వేత గానీ సిద్ధంగా లేరు. వీళ్లకు విజయవాడ తూర్పు గానీ లేకపోతే విజయవాడ ఎంపీ సీటు కావాలి.
సీట్ల సర్దుబాటు కష్టమే.. కానీ..!?
ఇప్పటికే విజయవాడ తూర్పులో గద్దే రామ్మోహన్ ఉన్నారు. ఒక వేళ గద్దే రామ్మోహన్ ను గన్నవరం పంపితే విజయవాడ తూర్పు నుండి పోటీ చేయడానికి వంగవీటి రాధ సుముఖంగా ఉన్నారు. లేకపోతే విజయవాడ సెంట్రల్ ఇవ్వాలని రాధా కోరుతున్నారు. విజయవాడ సెంట్రల్ ఇవ్వడానికి టీడీపీలో సాధ్యం కాదు. ఎందుకంటే గత ఎన్నికల్లో కేవలం 25 ఓట్ల తేడాతో ఓడిపోయిన బొండా ఉమా రాబోయే ఎన్నికల్లో అక్కడ నుండే పోటీ చేసి గెలవాలన్న పట్టుదలతో ఉన్నారు. బొండా ఉమా విజయవాడ సెంట్రల్ ను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టరు. ఇలా విజయవాడ నగరం చుట్టూ తెలుగుదేశం పార్టీలో అభ్యర్ధుల ఎంపికపై అంతర్గత సమస్యలు, చర్చలు మరీ ఎక్కువగా ఉన్నాయి. మరో పక్క బుద్దా వెంకన్న, నాగుల్ మీరా, జలీల్ ఖాన్ కుమార్తె లు పశ్చిమ టికెట్ ను ఆశిస్తున్నారు. ఇలా విజయవాడ టీడీపీలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో లగడపాటి రాజగోపాల్ ను పార్టీలో చేర్చుకుని ఆయనకు గానీ ఆయన కుమారుడికి గానీ సీటు కేటాయింపు అంశం టీడీపీకి కత్తిమీద సాముగానే చెప్పుకోవచ్చు..!