అమరావతి, మార్చి 21: టిడిపికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఎల్ లతితాకుమారికి చేజారిన అవకాశం మళ్లీ వరించింది. చేజారిన పూతలపట్టు నియోజకవర్గ టిడిపి అభ్యర్థిత్వం ఆమెకు ఖరారు అయ్యింది.
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గ టిడిపి అభ్యర్థిగా 2009, 2014 ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలయిన ఎల్ లలితాకుమారి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు.
లలిత కుమారి 2004 ఎన్నికల్లో పలమనేరు నియోజకవర్గం నుండి టిడిపి అభ్యర్థిగా విజయం సాధించింది.
నియోజకవర్గం మారి పూతలపట్టులో పోటీ చేసిన రెండు సార్లు పరాజయం పాలయ్యింది. అయినప్పటికీ ఈ ఎన్నికల్లోనూ టిడిపి తరపున పోటీ చేయడానికి ప్రయత్నించింది. నియోజకవర్గ పార్టీ ఇన్చార్జిగా ఉన్న లలిత కుమారి గత కొన్ని రోజులుగా తానే అభ్యర్థినంటూ ప్రచారం చేసుకోంటుంది.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఐవిఆర్ఎస్ సర్వే ద్వారా తెర్లాం పూర్ణంకు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.
టిడిపి విడుదల చేసిన అభ్యర్థుల చివరి జాబితాలో లలితాకుమారి పేరు లేకపోవడంతో ఆమె ఖంగుతిన్నది.
అభ్యర్థిత్వం ఖరారు అయిన తెర్లాం పూర్ణం బుధవారం సాయంత్రం బి ఫారం తీసుకువెళ్లడానికి రాలేదు. పార్టీ నేతలకు కూడా అందుబాటులోకి రాలేదు. అనారోగ్యంతో ఉండటం వల్ల తాను రాలేకపోయినట్లు చెప్పినట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలో అభ్యర్థి మార్పుపై టిడిపి స్క్రీనింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. అభ్యర్థి పూర్ణం స్థానంలో నియోజకవర్గ ఇన్చార్జి లలితా కుమారికే అవకాశం కల్పించారు.