విశాఖపట్నం, జనవరి25: ప్రత్యేకహోదా అంశంతోపాటుగా ప్రధాన సమస్యలపై రాజకీయ పోరాటానికి జనసేనతో ఏకాభిప్రాయానికి వచ్చినట్లు వామపక్ష నేతలు ప్రకటించారు. శుక్రవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో విశాఖ రుషికొండ రిసార్ట్స్లో జరిగిన సమావేశానికి సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర రెడ్డి, సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు,వామపక్ష పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలపై కూలంకషంగా చర్చించినట్లు నేతలు వెల్లడించారు.
ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం ఆంధ్రప్రదేశ్ను ఖచ్చితంగా మోసం చేసిందని సిపిఎం నేత రాఘవులు ఆరోపించారు. ఈ విషయంలో ప్రజా ఉద్యమాలతోపాటు రాజకీయ పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. యువతరానికి పవన్ ఒక చుక్కాని అని ఆయన చెప్పారు. రాష్ట్ర రాజకీయాల్లో నిజమైన ప్రత్యామ్నాయంగా జనసేన ముందుకు వచ్చిందని ఆయన అన్నారు.
సిపిఐ నేత సురవరం మీడియాతో మాట్లాడుతూ మూడు పార్టీలు కలసి ఉమ్మడి ప్రణాళికతో ముందుకు వెళదామని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ దేశంలో ఒక తక్షణ అవసరంగా ఉందని ఆయన అన్నారు. మైనింగ్, భూసేకరణ, పర్యావరణ పరిరక్షణ, మానవ హక్కులు, సామాజిక న్యాయం, ఈవిఎంల ట్యాపరింగ్ తదితరల అంశాలపైన చర్చించినట్లు ఆయన తెలిపారు.
పర్యావరణం కాలుషితం కావడం వల్ల పంటలు దెబ్బతింటున్నాయి, వాతావరణం వేడెక్కుతోంది, నదులు, చెరువులు కాలుష్యమయం అవుతున్నాయి అని ఆయన చెప్పారు. ఉద్దానంలో ఈ కారణంగానే కిడ్నీల సమస్య తలెత్తిందన్నారు. పవన్ ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారని ఆయన చెప్పారు. ఈ సమస్యపై ప్రభుత్వం ఇంకా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టలేదని ఆయన ఆరోపించారు. మైనింగ్ పాలసీ, బాక్సైట్ తవ్వకం పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొనివుందని ఆయన అన్నారు. మైనింగ్కు వ్యతిరేకం కాదనీ, బాధితులకు సరైన నష్టపరిహారం అందాలని ఆయన కోరారు. నిబంధనల ప్రకారం సక్రమంగా మైనింగ్ జరగాలనీ, అక్రమాలు ఉండకూడదనీ ఆయన చెప్పారు.