అమరావతి: కృష్ణానది కరకట్టపై 26 అక్రమ నిర్మాణాలను గుర్తించామనీ, వాటికి మరో సారి నోటీసులు ఇస్తామనీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ తెలిపారు. బుధవారం శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో అక్రమ నిర్మాణాలపై వాడివేడి చర్చ జరిగింది.
చంద్రబాబుపై కక్షసాధింపు చర్యలో భాగంగానే ప్రభుత్వం కరకట్టపై అక్రమ నిర్మాణాలకు నోటీసులు జారీ చేసిందని టిడిపి సభ్యులు ఆరోపించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలోనే కరకట్టపై నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారనీ, అప్పుడు చట్టాలు గుర్తుకు రాలేదా అని వారు ప్రశ్నించారు.
దీనిపై మంత్రి బొత్సా వివరణ ఇచ్చారు. నది వెంబడి నిర్మాణాలు చేపట్టకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ చంద్రబాబు వాటిని తుంగలో తొక్కి ప్రజావేదికను కట్టారని బొత్సా అన్నారు. ప్రజావేదికకు అనుమతులు ఇచ్చిన అధికారుల నుండే దానికయిన ఖర్చు ఎనిమిది కోట్ల రూపాయలు వసూలు చేస్తామని బొత్సా అన్నారు. చంద్రబాబు ప్రస్తుతం ఉంటున్న నివాసం కూడా అక్రమ నిర్మాణమేననీ, ఆయన ఆ ఇల్లు ఖాళీ చేయడం మంచిదని బొత్సా సూచించారు. కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణాలకు మరో సారి నోటీసులు జారీ చేస్తామని బొత్సా వెల్లడించారు. కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణాలు అన్నింటిపైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని బొత్స స్పష్టం చేశారు.