అమరావతి: జలవనరుల శాఖలో భారీగా అవినీతి జరిగిందని ఏపి నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ ఆరోపించారు. బుధవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి అనిల్ కుమార్ మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో జలవనరుల శాఖలో తీవ్రస్థాయిలో అవినీతి చోటుచేసుకుందని విమర్శించారు. చంద్రబాబు అనుభవం దోచుకోవడానికే పనికి వచ్చిందని అనిల్ కుమార్ వ్యాఖ్యానించారు.
వివిధ సాగునీటి ప్రాజెక్టుల్లో 16వేల కోట్ల రూపాయల మేర అంచనాలు పెంచి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని అనిల్ కుమార్ పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం శిలాఫలకాలు వేయడంపై చూపిన శ్రద్ద ప్రాజెక్టులు పూర్తి చేయడంలో చూపలేదని అనిల్ కుమార్ విమర్శించారు.
ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో రివర్స్ టెండరింగ్ పద్ధతిని తెస్తున్నామని అనిల్ కుమార్ తెలిపారు. కాంట్రాక్టుల్లో పారదర్శకత కోసం జ్యూడీషియల్ కమిషన్ను ఏర్పాటు చేస్తున్నామని అనిల్ కుమార్ వివరించారు.
వైసిపి సభ్యుడు కాకాని గోవర్థన్ రెడ్డి మాట్లాడుతూ టిడిపి హయాంలో నీటి పారుదల శాఖను వారు నిధుల పారుదల శాఖలా నిర్వహించుకున్నారని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టుల్లో అవినీతిపై విచారణ జరిపించాలని గోవర్థన్ రెడ్డి డిమాండ్ చేశారు.
రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో 150 కోట్ల రూపాయల పనులు నామినేషన్ పద్ధతిపై కట్టబెట్టారని ఆరోపించారు. అవినీతికి పాల్పడిన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు.