హైదరాబాదు, మార్చి 3: పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, టిడిపి సీనియర్ నాయకుడు కనుమూరు రఘురామ కృష్ణంరాజు తిరిగి సొంత గూటికి (వైసిపిలోకి) చేరారు.
ఆదివారం ఉదయం వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డితో కలిసి లోటస్పాండ్లో వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డితో భేటీ అయ్యారు.
నరసాపురం పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసే అంశంపై వారి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.
పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి రఘురామకృష్ణంరాజుకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వనించారు.
వైపిసిలో సీటు కేటాయింపుపై రామకృష్ణంరాజుకు పార్టీ అధినేత నుండి స్పష్టమైన హామీ లభించినట్లు సమాచారం.
రఘురామకృష్ణం రాజు తొలుత వైసిపి నుండి బిజెపి చేరారు. 2018 మే నెలలో టిడిపిలో చేరారు.
ఇటీవల అమరావతిలో జరిగిన నరసాపురం పార్లమెంట్ పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాల టిడిపి సమన్వయ కమిటీ సమావేశాల్లో కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసే సమయంలో రఘురామకృష్ణంరాజుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సరైన ప్రాధాన్యత ఇవ్వలేకపోవడం, పార్లమెంట్ సీటు కేటాయింపుపై స్పష్టమైన హామీ లభించకపోవడంతో టిడిపికి గుడ్బై చెప్పారని తెలుస్తోంది.
ఈ సందర్భంలో రఘురామకృష్ణం రాజు మిడియాతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో నరసాపురం పార్లమెంట్ స్థానం నుండి వైసిపి నుండి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. పార్లమెంట్ సీటు గురించే పార్టీ మారలేదనీ, రాష్ట్ర ప్రజలు వైసిపి వైపు చూస్తున్నారని అన్నారు. ప్రజాభీష్టం మేరకు తాను సొంతింటికి చేరినట్లుగా వైసిపిలోకి వచ్చానని రఘురామకృష్ణంరాజు చెప్పారు.