అమరావతి: ‘ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వనికే అధికారులు రిపోర్టు చేయాలి. మా ప్రభుత్వానికి సంపూర్ణ అధికారాలున్నాయి. ఎన్నికలు మినహా..మిగతా వ్యవహారాలన్నీ మేమే రివ్యూ చేస్తాం. అధికారులు నాకే రిపోర్టు చేయాలి. వచ్చే వారం కేబినెట్ సమావేశం కూడా పెడతాం. సమీక్షలు, సమావేశాలకు అధికారులు రామంటే కుదరదు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడంపై బిజెపి నేతగా మారిన మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ట్విట్టర్ వేదికగా చలోక్తి విసిరారు.
‘నిన్న ఉదయం ఫణి తుఫాను నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అధికారులకు ముప్పు తప్పిపోయిందని సంతోషపడ్డాను. కానీ ఈ తుఫాను సాయంత్రానికల్లా మంత్రివర్గ సమావేశం రూపంలో అధికారులను వెంటాడుతుందని ఊహించలేకపోయాను’. అంటూ ఐవైఆర్ కృష్ణారావు తన దైన శైలిలో ట్వీట్ చేశారు.
ఐవైఆర్ కృష్ణారావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన తరువాత బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ బాధ్యతలను నిర్వహించారు. ఆ పదవి నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పించిన తరువాత ఐవైఆర్ బిజెపిలో చేరారు.
అప్పటి నుండి మీడియాలో వచ్చిన కథనాలు, వార్తలపై ప్రధాన ప్రతిపక్షంకు ధీటుగా ఎప్పటికప్పుడు స్పందిస్తూ ప్రభుత్వంపై, చంద్రబాబుపై ఐవైఆర్ కృష్ణారావు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.