తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నిక హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా దుబ్బాకలో డబ్బులు పట్టుబడిన ఉదంతం సంచలనంగా మారింది. అయితే, ఈ విషయంలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీజేపీలో కేసీఆర్ అనుకూల ,వ్యతిరేక వర్గాలు బయటపడుతున్నాయని అన్నారు. కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జి.కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు మురళీధర్ రావు, విద్యాసాగర్ రావుపై సంచలన కామెంట్లు చేశారు.
బండి సంజయ్కు వ్యతిరేకంగా ఆ బీజేపీ నేతలు
టీఆర్ఎస్ పార్టీతో బీజేపీ ముఖ్య నేతలు కుమ్మక్కయ్యారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇన్నాళ్లు బీజేపీ నేతలు, తమను టీఆర్ఎస్ ఏమీ అనదని అనుకున్నారని, కానీ నిన్నటి ఘటనతో బీజేపీ నేతలకు తత్వం బోధపడిందని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను గతంలో చెంప పగలగొడితేనే ఏం చేయలేదని, అందుకే పోలీసులు ఇప్పుడు మెడకాయ పిసికారని రేవంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ లో ఉన్న ఎంపీ అరవింద్, సంజయ్ ను పరామర్శించడానికి కరీంనగర్ కు వెళ్లారని, కానీ కరీంనగర్లోనే ఉన్నబీజేపీ సీనియర్ నేతలు మురళీధర్రావు, విద్యాసాగర్ రావు ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు.
కిషన్ రెడ్డి ఏం చేస్తున్నారు?
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దుబ్బాక ఘటనపై కిషన్ రెడ్డి ఎందుకు రివ్యూ చేయలేదని రేవంత్ అన్నారు. కలెక్టర్, సీపీని పిలిచి సమీక్షించే అధికారం ఉన్నా కిషన్రెడ్డి ఆ పని చేయలేదని విమర్శించారు. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు కేంద్రం సెక్యూరిటీ ఇచ్చినపుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ అయిన సంజయ్ కి సెక్యూరిటీ ఇచ్చేందుకు కేంద్రం ఎందుకు ఆలోచిస్తుందని అన్నారు. కేంద్రం నుంచి కూడా కిషన్ రెడ్డి ఎంక్వయిరీ వేయొచ్చని అన్నారు. కిషన్ రెడ్డికి- సీఎం కేసీఆర్ కు ఉన్న మ్యాచ్ ఫిక్సింగ్ ఏంటో చెప్పాలని రేవంత్ అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ను కాదని కేంద్రంలో ఉన్న బీజేపీ తెలంగాణ లో ఏం చేయదని, హరీష్ ప్రచారం చేస్తే శాంతి భద్రతలు తలెత్తనప్పుడు తాము వెళ్తే ఎందుకు శాంతి భద్రతలు తలెత్తుతాయని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీలో ఉన్న కొంత మంది ముఖ్యనేతలు తమ గెలుపు కోసం ఇతరులను బలి చేస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. వారి గెలుపు కోసం బలహీన మైన అభ్యర్థులను పోటీ లో దింపేలా ఇతర పార్టీ లతో కుమ్మక్కు అయ్యారన్నారు.