విజయవాడ సిఎం జగన్ చెప్పినట్లుగానే జిఎన్ రావు కమిటీ రిపోర్టు ఇచ్చిందనీ, ఈ కమిటీనే ఒక బోగస్ అని టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా విమర్శించారు. ప్రాంతాల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టేందుకే వైసిపి ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. రాజధాని ప్రాంత మంత్రులు కూడా ఈ ప్రాంత విశ్వాసాలను పరిగణలోకి తీసుకోకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడడం బాధాకరమని ఉమ పేర్కొన్నారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే విశాఖలో గత ఆరు నెలలుగా వైసిపి నేతలు వేల ఎకరాలను ఇన్ సైడ్ ట్రేడింగ్ చేశారని ఆయన ఆరోపించారు. అమరావతిలో ఒక సామాజిక వర్గం మీద కక్షతో అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు.అమరావతి నుండి రాజధానిని తరలిస్తే సహించేది లేదని అన్నారు. ప్రజలకు అండగా ఉండి పోరాటం చేస్తామని ఉమా చెప్పారు.