విజయవాడ: రాజధాని రైతుల ఆగ్రహం చూసి జీఎన్.రావు కమిటీ దొడ్డిదారిన పారిపోయిందని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జీఎన్.రావు కమిటీ కాదని అది జగన్ కమిటీ అని అన్నారు. జగన్ పుట్టిన రోజు కానుకగా ప్రజల గుండెల మీద తన్నాడని పేర్కొన్నారు. 29 గ్రామాల ప్రజలు రోడ్డు మీద ఉంటే జగన్ పుట్టిన రోజు పండగలు చేసుకుంటున్నాడని మండిపడ్డారు. ‘తుళ్లూరులో వరదలు వస్తాయా? జిఎన్ రావు కమిటీకి బుర్ర ఉందా?‘ అని వ్యాఖ్యానించారు.
విశాఖలో చాలా భూములు విజయసాయిరెడ్డి కబ్జా చేశారని దేవినేని ఉమ ఆరోపించారు. రియల్ ఎస్టేట్ కోసమే విశాఖ రాజధాని అంటున్నారని ఉమామహేశ్వరరావు విమర్శించారు. విశాఖలో నాలుగు నెలలుగా వైసీపీ నేతలు భారీగా భూములు కొన్నారని ఆరోపించారు. కమర్షియల్ కాంప్లెక్స్ భూములను విజయసాయిరెడ్డి కాజేశారని, వాల్తేరులో 13 ఎకరాలు కబ్జాకు విజయసాయి యత్నించారని దుయ్యబట్టారు. మధురవాడ, భోగాపురంలో ఆరు వేల ఎకరాలు చేతులు మారుతున్నాయని, ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ కి వైఎస్ పెరు పెట్టటానికి విశాఖ రాజధాని అంటూ తెరలేపారని ఆరోపించారు. ప్రభుత్వం మెడలు వంచైనా రాజధానిని కాపాడుకుంటామని స్పష్టం చేశారు. జీఎన్.రావు కమిటీ రిపోర్ట్ను పక్కనపెట్టి అమరావతిని అభివృద్ధి చేయాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు.