డోనాల్డ్ ట్రంప్.. 2016కు ముందు ఈ పేరు గురించి, గానీ ఆ వ్యక్తి గురించిగాని ప్రపంచానికి పెద్దగా తెలియదు. కానీ 2016 తర్వాత దీనిని పూర్తి భిన్నంగా మారిపోయింది. ఎందుకంటే డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయన ప్రత్యర్థిగా ఉన్న హిల్లరీ క్లింటన్ ఆ ఎన్నికల ప్రచారంలో ముందంజలో ఉండటంతో.. గెలుపు ఆమెది అనుకున్నారు. కానీ, ఇవన్నీ పట్టించుకోని ట్రంప్.. స్థానిక అంశాన్ని తెరమీదకు తెచ్చి.. ప్రచారంలో జోరు పెంచడంతో అధ్యక్ష ఎన్నికల్లో విజయబావుట ఎగరేశారు. దీంతో ఆయన పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది.
అయితే, అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత కూడా ఆయన తనదైన భిన్న శైలీలో పాలన సాగిస్తూ.. నిత్యం వార్తల్లో నిలిచేవారు ట్రంప్. మరీ ముఖ్యంగా ఇతర దేశాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడంతో పాటు ఇటు అమెరికా పౌరుల్లో స్థానికత విషయాన్ని ప్రచారం చేస్తూ.. అక్కడి వారిలో మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే, కరోనా విషయంలో మాత్రం ఆయన వైఫల్యం చెందారనీ, అందుకే తీవ్ర స్థాయిలో వైరస్ విజృంభణ కొనసాగి.. భారీ సంఖ్యలో ప్రజలు వైరస్ బారినపడ్డారని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లోనూ ట్రంప్ బరిలో నిలిచి.. తన పత్యర్థి డెమోక్రటిక్ పార్టీ నేత జో బైడెన్ చేతితో పరాజయం పాలయ్యారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ.. మరో సారి అధ్యక్షునిగా కొనసాగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారనే వార్తలు సైతం గుప్పుమన్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా అక్కడ జరిగిన ఎన్నికల ఫలితాలను వ్యతిరేకిస్తూ.. భారీ స్థాయిలో ప్రజలు ఆందోళనకు దిగారు. వాషింగ్టన్లోని ఫ్రీడమ్ ప్లాజా వద్ధకు భారీగా చేరుకున్న ట్రంప్ మద్ధతుదారులు.. ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు.
ఈ ఆందోళన ర్యాలీలో పాల్గోన్న వారిలో వేలాది మంది అమెరికా జాతీయ జెండాలను చేతబూని ఎన్నికలకు వ్యతిరేకంగా.. ట్రంప్నకు అనుకూలంగా నినాదాలు చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. వీరిలో చాలా మంది హెల్మెట్లు, బులెట్ప్రూఫ్ వెస్ట్లు ధరించడం గమనార్హం. అయితే, అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ట్రంప్నకు 232 ఓట్లు రాగా, జో బైడెన్కు మొత్తంగా 306 ఓట్లను సాధించి విజయ దుందుభి మోగించారు. అయితే, ట్రంప్ అధ్యక్ష పదవీ కాలం ముగియటానికి ఇంకొంత సమయం ఉండటంతో ఆయన మార్కును చూపించే ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. ఇదే గనక నిజమైతే.. ఇప్పటికే ఆంక్షలతో హడలెత్తి పోతున్న చైనాకు మరిన్ని చిక్కులు తప్పవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.