AP Elections: ఏపీలో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. పార్టీల నేతలు, అభ్యర్ధులు విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని కూడా నిర్వహిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి మొత్తం అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు అభ్యర్ధులను బరిలో దింపేందుకు సన్నద్దం అవుతోంది. ఇండియా కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న ఉభయ కమ్యూనిస్టులకు కలిపి రెండు పార్లమెంట్, 16 అసెంబ్లీ స్థానాలు కేటాయించి మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసేందుకు సమాయత్తం అవుతోంది.
ఈ క్రమంలో 150 అసెంబ్లీ, 20 లోక్ సభ స్థానాలకు అభ్యర్ధులను పార్టీ హైకమాండ్ ప్రకటించింది. పలు పార్టీల్లో లోక్ సభ టికెట్ ఆశించిన వారికి ఎమ్మెల్యే టికెట్లు, ఎమ్మెల్యే టికెట్ ఆశించిన వారికి ఎంపీ టికెట్ లు దక్కాయి. దీంతో చాలా వరకు పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తాజాగా విడుదల చేసిన అభ్యర్ధుల జాబితాలో సీనియర్ మహిళా నేత, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుందర పద్మశ్రీకి విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేసింది పార్టీ. అయితే ఈ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయడానికి సుంకర పద్మశ్రీ విముఖత వ్యక్తం చేస్తున్నారు. దీంతో పార్టీ అధిష్టానం ఈ నియోజకవర్గానికి మరో అభ్యర్ధిని ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తనకు అసెంబ్లీకి పోటీ చేసే అలోచన లేదని సుందర పద్మశ్రీ స్పష్టం చేశారు. తాను విజయవాడ లోక్ సభ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేయాలని ఆశించానని చెప్పారు. కొన్ని కారణాల వల్ల పార్టీ హైకమాండ్ అవకాశం ఇవ్వలేకపోయిందని అన్నారు. అయితే తనను సంప్రదించుకండానే విజయవాడ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్ధిగా ప్రకటించారని చెప్పారు. తనకు అసలు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆలోచనే లేదని అన్నారు. ఎంపీ అభ్యర్ధిగా అయితేనే పోటీ చేస్తానని చెప్పారు. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. ఎంపీగా పోటీకి అవకాశం లేకపోతే పార్టీ కోసం, పార్టీ అభ్యర్ధుల గెలుపునకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. తాను తీసుకున్న నిర్ణయానికి అధిష్టానం సహృదయంతో సహకరిస్తుందని భావిస్తున్నానని పద్మశ్రీ తెలిపారు.
AP Elections 2024: మరో 38 మంది అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్