ప్రముఖ సినీనటి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి ఆ పార్టీకి రాం రాం చెప్పి, కాషాయం గూటికి చేరనున్నరా? ఆమె రాజకీయ అడుగులు ఎటు? అనే విషయాలపై త్వరలో క్లారిటీ వచ్చే పరిస్థితి కనబడుతోంది. గత పార్లమెంట్ ఎన్నికల అనంతరం విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో అంతగా చురుగ్గా ఉండటం లేదనీ, బీజెపీలో చేరే అవకాశాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో వార్తలూ వచ్చాయి. కానీ వాటిపై విజయశాంతి స్పందించలేదు. కానీ ఇప్పుడు తాజాగా జరిగిన పరిణామాలు చూస్తుంటే విజయశాంతి బీజేపీకి చేరేందుకు సుముఖంగా ఉన్నారనే వార్తలకు బలం చేకూరుతోంది.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో భేటీ అందుకేనా..?
గత కొంత కాలంగా తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో అధికారమే లక్ష్యమే బీజేపీ అడుగులు వేస్తున్నది. యువ నాయకత్వాన్ని పెట్టపీట వేస్తున్నది. ఈ క్రమంలో భాగంగానే నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుండి మొదటి సారి గెలిచిన కిషణ్ రెడ్డికి కేంద్ర సహాయ మంత్రిగా అవకాశం కల్పించడం, యువ ఎంపి బండి సంజయ్కు పార్టీ బాధ్యతలు అప్పగించడం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ నుండి చేరిన సీనియర్లకు పార్టీలో మంచి ప్రాధాన్యత కూడా ఇస్తున్నారు. 2019 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీలో చేరిన డీకె అరుణకు జాతీయ ఉపాధ్యక్షురాలిగా అవకాశం కల్పించారు. ఇప్పుడు తాజాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషణ్ రెడ్డి నిన్న జూబ్లీహిల్స్ లోని విజయశాంతి నివాసానికి వెళ్లి దాదాపు గంట సేపు భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నది. విజయశాంతిని పార్టీలోకి అహ్వానించడానికే కిషణ్ రెడ్డి ఆమె ఇంటికి వెళ్లి చర్చలు జరిపారని వార్తలు వస్తున్నాయి.
బీజేపీ నేతలకు మద్దతుగా పత్రికా ప్రకటన
దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో నిన్నసిద్ధపేటలో జరిగిన ఘటనపై విజయశాంతి స్పందించారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని, పోలీసులు వ్యవహరిస్తున్న తీరును తీవ్ర స్థాయిలో విమర్శించిన విజయశాంతి..బండి సంజయ్ అరెస్టును ఖండించారు. దీంతో విజయశాంతి బీజెపీలో చేరడం ఖాయమేనంటున్నారు. ముహూర్తమే ఫిక్స్ కావాల్సింది ఉందిట.