అమరావతి, ఎప్రిల్ 28: ఈ ఐదేళ్లలో చంద్రబాబు చేసిన అవినీతి, అక్రమాలకు శిక్ష అనుభవించకతప్పదని వైసిపి సీనియర్ నేత సి రామచంద్రయ్య అన్నారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐదేళ్లలలో చేసిన అన్ని పనులపై విచారణ జరిపించి తీరుతామని రామచంద్రయ్య స్పష్టం చేశారు.
రాష్ట్రంలో నీటి సమస్య ఉంది, హాస్టల్స్లో విద్యార్థులకు సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. హాస్టల్స్ ఘోరంగా తయారు అయ్యాయి. మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయి సమస్యలో ఉన్నారు ఇటువంటి వాటిపై చంద్రబాబు రివ్యూ చేశారా అని ప్రశ్నించారు. కమీషన్లు వచ్చే వాటిపై మాత్రం రివ్యూలు చేస్తారని రామచంద్రయ్య విమర్శించారు.
పిడి ఎకౌంట్లు ఖాళీ చేశారని రామచంద్రయ్య అన్నారు. ఆర్థిక పరిస్థితులపై సీఎస్ సమీక్ష జరిపితే చంద్రబాబు, టిడిపి నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని రామచంద్రయ్య మండిపడ్డారు. బడ్జెట్లో ఒక క్రమ పద్ధతి లేకుండా పోయిందని అన్నారు. నిబంధనలు అతిక్రమించి చంద్రబాబు అప్పులు తీసుకొచ్చారని రామచంద్రయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త ప్రభుత్వానికి 4.79లక్షల కోట్లు రూపాయల రెవెన్యూ లోటు ఇచ్చి చంద్రబాబు వెళుతున్నాడని రామచంద్రయ్య విమర్శించారు. పసుపు కుంకుమ కింద ఓట్లు పొందడానికి డబ్బులు సంపాదించడానికే రివ్యూ చేస్తారని రామచంద్రయ్య అన్నారు. చంద్రబాబు అక్రమాలు, అరచకాలు వెలుగులోకి రావడం ఖాయమని రామచంద్రయ్య పేర్కొన్నారు. రాష్ట్రంలో అవినీతి జరిగినట్లు కాగ్ రిపోర్టు కూడా ఇచ్చిందని రామచంద్రయ్య అన్నారు.
ఇప్పటి వరకూ స్టేలతో కేసుల విచారణ నుండి తప్పించుకున్న చంద్రబాబుకు ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదని అన్నారు. సుప్రీం కోర్టు సుదీర్ఘకాలంగా ఉన్న పెండింగ్ కేసులకు సంబంధించి స్టేలు ఎత్తివేసిందనీ, లక్ష్మీపార్వతి పెట్టిన కేసు విచారణకు వచ్చిందని రామచంద్రయ్య గుర్తు చేశారు. ఆయనపై కేసుల విచారణ ప్రారంభం అయితే ఆదివారం ఒక్క రోజే ఖాళీ ఉంటుందని రామచంద్రయ్య అన్నారు.