వైసీపీ రెబర్ ఎంపి రఘురామ కృష్ణం రాజు వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్మోహనరెడ్డి పై విమర్శలు, ఆరోపణలు కొనసాగిస్తూనే ఉన్నారు. నేడు తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) తీసుకున్న నిర్ణయాలను తప్పుబడుతూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. టిటిడి ఆలయ నిబంధనలు, నమ్మకాలను యధావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు రఘురామ కృష్ణం రాజు.
ఆ నిర్ణయాలు అమలు చేస్తే రాష్ట్రం రాష్ట్రంలా ఉండదు
అన్యమతస్తులకు డిక్లరేషన్ విధానం అక్కర్లేదని టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం, సోనియా గాంధీ వంటి వ్యక్తులు వచ్చినప్పటికీ డిక్లరేషన్ ఇచ్చారని రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు. అప్పటి ప్రతిపక్ష నేత, నేటి సీఎం వైఎస్ జగన్ తిరుమలకు వెళ్లినప్పుడు డిక్లరేషన్ ఇవ్వలేదని అంటూ ఆయన ఎందుకు అలా చేశారో తనకు తెలియదన్నారు. తిరుమలలో నిబంధనలను మర్చేందుకు సొంత బాబాయిని చైర్మన్ గా పెట్టారని కొందరు తనతో చెప్పారనీ, కానీ సీఎం జగన్ లౌకికవాది అని తాను అనుకుంటున్నాననీ అన్నారు. నేడు టిటిడి తీసుకుంటున్న నిర్ణయం చాలా తప్పని పేర్కొన్నారు. ఇలాంటి నిర్ణయాలతో హిందూ సమాజం మొత్తం ఘోషిస్తుందని అన్నారు. టిటిడి కానుకలను బాండ్ల రూపంలో మార్చడం ఏమిటని రామకృష్ణం రాజు ప్రశ్నించారు. ఈ నిర్ణయాలు అమలు అయితే రాష్ట్రం రాష్ట్రంలా ఉండదని హెచ్చరించారు రఘురామ కృష్ణం రాజు. ముఖ్యమంత్రి చొరవ తీసుకుని టిటిడి ఆలయ నిబంధనలు, నమ్మకాలను యధావిధిగా అమలు అయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
కాంట్రాక్టర్ ల దోపిడీ అరికట్టాలి
రాష్ట్రంలో మద్యం, అమ్మకాలు, రోడ్ల నిర్మాణాల్లో అవినీతిపైనా రఘురామ కృష్ణం రాజు విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో చీప్ లిక్కర్ అధిక ధరలకు విక్రయిస్తూ ప్రజారోగ్యాన్ని పాడుచేస్తున్నారని విమర్శించారు రఘురామ కృష్ణం రాజు. ముగ్గురి కోసం ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా తయారు అయ్యాయనీ, రోడ్ల టెండర్లు అన్నీ ఒకే సామాజిక వర్గానికి వచ్చాయనీ ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న కాంట్రాక్టర్ ల దోపిడీ అపాలని డిమాండ్ చేశారు రఘురామ కృష్ణం రాజు. కొందరు తన మానసిన స్థితి సరిగా లేదంటూ వ్యాఖ్యానాలు చేస్తున్నారనీ, తనపై ఆ విధంగా అంటున్న వారి మానసిక స్థితే సరిగా లేదనీ అనుకోవాల్సి వస్తుందన్నారు. తాను రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తిని అని చెప్పుకున్న రఘురామ కృష్ణం రాజు.. తనపై అనర్హత వేటు వేయడం సాధని మరో సారి స్పష్టం చేశారు. తనపై జరుగుతున్న కుట్రలకు సంబంధించి త్వరలో ప్రదాన మంత్రి మోడికి లేఖ ద్వారా ఫిర్యాదు చేస్తానని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు.