YSRCP: పదవి ఎదురుగా కనిపిస్తుంది.. పార్టీ ఊరిస్తుంది.. కోర్టు క్లారిటీ ఇవ్వకుంది.. మోజు ఆగకుండా పరిగెడుతుంది.. అయ్యో… వైసీపీలో ఈ కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. అంతా సవ్యంగా జరిగితే మండలిలో వైసీపీ బలం 35 కి చేరిపోయేది. టీడీపీ కంటే రెట్టింపయ్యేది. కానీ ఈ పరిషత్ ఎన్నికల గొడవ కారణంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సిల ఎన్నిక జరగడం లేదు. పాపం ఆ 11 ఖాళీలకు ఎవరెవరు.., ఎప్పుడు భర్తీ అవుతారో తెలియక ఒక అస్పష్ట రాజకీయంలో కొట్టుమిట్టాడుతున్నారు ఆశావహులు. మరోవైపు పార్టీ పెద్దలు కూడా ఇదే అంతర్మథనంలో ఉన్నారు..
YSRCP: ఎప్పటికి తేలెనో వివాదం..!!
రాష్ట్రంలో మార్చి నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారు. మండల, జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యుల ఎన్నిక పోలింగ్ మార్చి 8న జరిగింది. అయితే కోర్టులో పిటిషన్ ఉండడంతో అప్పట్లోనే కౌంటింగ్ జరగలేదు, ఫలితాలు ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో గత నెలలోనే కోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చింది. ఎన్నికలను రద్దు చేసి మళ్ళీ రీ నోటిఫికెషన్ ఇచ్చి, నిర్వహించాలని ఆదేశించింది. కానీ ప్రభుత్వం అంగీకరించే పరిస్థితి లేదు. రివ్యూ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ పెండింగ్ లో ఉంది. ఇది ఇలా ఉండగా… ఈ తీర్పు రావాలి… వివాదం వీడాలి, స్థానిక సంస్థలకు ప్రతినిధులు రావాలి.., అప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగాలి.. చాలా ప్రక్రియ ఉంది. ఇది మొత్తం తేలడానికి కనీసం నాలుగు నెలల పాటూ సమయం పట్టే అవకాశం ఉంది అంటున్నారు. అప్పటి వరకు ఆశావహులు వేచి చూడాల్సి ఉంది.
ఆశావహుల జాబితా పెద్దదే..!
మరోవైపు అధికార పార్టీలో ఈ ఆశావహుల జాబితా పెద్దదే ఉంది. 11 స్థానాలు ఖాళీ అవుతుండగా.., దాదాపు 25 మంది పదవులు ఆశిస్తున్నారు. వారిలో సీఎం జగన్ తో ముందు నుండి పార్టీలో నడిచిన వారూ… గత ఎన్నికల్లో సీటు వదులుకున్న వారూ.., ఎన్నికలు అయ్యాక పార్టీలో చేరిన వారూ ఉన్నారు. మూడో క్యాటగిరి కాకపోయినా మొదటి రెండు విభాగాలకు చెందిన నేతలకు పదవులు ఇవ్వాల్సి ఉంది. చిలకలూరిపేట నియోజకవర్గ నాయకుడు మర్రి రాజశేఖర్ (కమ్మ).., గన్నవరం నియోజకవర్గానికి చెందిన దుట్టా రామచంద్రరావు(కాపు)లతో పాటూ ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు పేర్లు ముందు వరుసలో ఉన్నాయి. విశాఖపట్నం జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు, తూర్పు గోదావరి నుండి ఇద్దరు.., కర్నూలు జిల్లాకుచెందిన ఇద్దరు నేతలు.. ఇలా పెద్ద జాబితానే ఉంది. వీటిని సర్దుబాటు చేయడం జగన్ కి కష్టమేమి కాదు. కాకపోతే కోర్టు నుండి క్లారిటీ రావాల్సి ఉంది..!