Amitabh Bachchan: రహదారులపై గుంతలు పడటం, వాటిపై ప్రయాణిస్తూ ప్రజలు ప్రమాదాలకు గురి అవ్వడం నిత్యం అక్కడక్కడా జరుగుతునే ఉంటుంది. అయినా అధికారులు గానీ, రాజకీయ నాయకులు గానీ వాటి గురించి పట్టించుకోరు. ప్రజలు కూడా గుంతలను రోడ్డుపై చూసీ చూడనట్లు వెళుతుంటారు. పాలకులను తిట్టుకుంటూ ఉంటారు. గుంతల రోడ్లపై అవస్థలు పడుతూనే ఉంటారు. అయితే 70 ఏళ్ల వృద్ధ జంట అందరిలా ఈ గుంతలను చూస్తూ ఊరుకోలేదు. ఎవరో వస్తారు, ఈ గుంతలను పూడుస్తారు అని ఆలోచించకుండా ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించడం కోసం వారే స్వచ్చందంగా గుంతలను పూడుస్తూ అందరికీ ఆదర్శనంగా నిలుస్తున్నారు.
హైదరాబాద్ కు చెందిన గంగాధర్ తిలక్, వెంకటేశ్వరీ దంపతులు 2010 నుండి ఓ కారులో రోడ్ బ్రాండ్ మెటీరియల్ తీసుకుని వెళ్లి గుంతలను పూడుస్తున్నారు. తమ కారుకు పాత్ హోల్ అంబులెన్స్ అని పేరు కూడా పెట్టారు. ఎక్కడైనా గుంత కనిపిస్తే వెంటనే కారు ఆపి ఆ గుంతను పూడ్చేస్తారు. ఇప్పటి వరకూ దాదాపు 2030 గుంతలను తిలక్ దంపతులు పూడ్చారు. ఒక్కో గుంత పూడ్చేందుకు సుమారు రూ.2వేలు ఖర్చు అవుతోంది. అయితే వీరు ఎవరి వద్ద నుండి ఈ పనుల కోసం విరాళాలను సేకరించడం లేదు. వారు తమ ఫించన్ డబ్బులనే ఈ గుంతలను పూడ్చడానికి ఖర్చు చేస్తున్నారు. తిలక్ రిటైర్డ్ రైల్వే అధికారి. తిలక్ దంపతులు చేస్తున్న ఈ సామాజిక సేవకు బిగ్ బీ అమిత్బ్ బచ్చన్ ఫిదా అయ్యారు. వారు చేస్తున్న సామాజిక సేవను ప్రశంసిస్తూ వారికి ఓ కారును బహుమతిగా అందించారు.