CP Stephen Ravindra: తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు పన్నిన కుట్రను ఛేదించినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. సుపారీ గ్యాంగ్ తో మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర చేయడం, దీని వెనుక బీజెపీ నేతల పేర్లు రావడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం అయ్యింది. మంత్రిని హత్య చేస్తే రూ.15 కోట్లు ఇస్తామని ఆఫర్ చేసినట్లు తమ దర్యాప్తులో తేలిందని సీపీ తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియా సమావేశంలో వెల్లడించారు. గత నెల 25న ఫరూక్, హైదర్ ఆలీ సుచిత్ర వద్ద ఓ లాడ్జిలో ఉండగా నాగరాజు మరి కొందరు వెంబడించి వారిపై దాడి చేసేందుకు ప్రయత్నించారన్నారు. వారి నుండి తప్పించుకున్న ఫరూక్, హైదర్ ఆలీ షేక్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారనీ, వారి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేయడం జరిగిందన్నారు. మహబూబ్ నగర్ కు చెందిన యాదయ్య, నాగరాజు, విశ్వనాధ్ దాడికి ప్రయత్నించినట్లు తేలిందన్నారు.
CP Stephen Ravindra: నిందితులకు ఢిల్లీలో బీజేపీ నేత డ్రైవర్ ఆశ్రయం
గత నెల 26న నిందితులను అరెస్టు చేసి విచారణ చేయగా ఈ ముఠా అంతా మంత్రి హత్యకు కుట్ర పన్నినట్లు తేలిందన్నారు. సుపారీ హత్య గురించి ఫరూక్..హైదర్ ఆలీకి చెప్పారనీ, వీరి మధ్య వివాదం మొదలైందన్నారు. ఫరూక్, హైదర్ ఆలీని చంపాలని మిగతా ముఠా చూసింది. హత్య కేసు బయటపడుతుందని మిగతా వాళ్ల ఢిల్లీకి పారిపోయారన్నారు. వారి కాల్ డేటా ద్వారా లొకేషన్ ట్రేస్ చేయగా బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి సర్వెంట్ క్వార్టర్స్ లో ఉన్నట్లు తేలిందనీ, వారికి జితేందర్ రెడ్డి డ్రైవర్, పీఏ రాజు షెల్టర్ ఇచ్చారన్నారు. రాఘవేంద్ర రాజు, మున్నూరు రవి నుండి రెండు మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను హత్య చేయాలని ప్లాన్ వేసినట్లు తేలిందన్నారు.
బీజేపీ నేతలు డీకె అరుణ, జితేందర్ రెడ్డి పాత్రలపైనా విచారణ
ఈ హత్యకు కుట్రలో జితేందర్ రెడ్డి పాత్రపైనా కూడా విచారణ జరుపుతామనీ, మాజీ మంత్రి డీకే అరుణ అనుచరులైనా అనుమానాలు ఉన్నాయనీ వాటిపైనా విచారణ చేస్తామని సీపీ చెప్పారు. సాంకేతిక ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నామనీ, ఉత్తరప్రదేశ్ నుండి నాగరాజు వెపన్స్ కొనుగోలు చేసినట్లు తేలిందన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకూ మొత్తం 8 మందిని అరెస్టు చేయడం జరిగిందన్నారు. నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించిన తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.