Janasena: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకూ ఏపి రాజకీయాలపైనే దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. గత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో పోటీ చేస్తానని ముందుగా ప్రకటించినప్పటికీ బీజేపీ నేతల ఒత్తిడితో విరమించుకున్నారు. బీజేపీతో జనసేన పొత్తులో ఉన్నప్పటికీ ఆ దిశగా ఉమ్మడి కార్యక్రమాలు నిర్వహించిన దాఖలాలు లేవు. బీజేపీ పెద్దలపై గౌరవం ఉందని చెబుతున్నప్పటికీ ఏపి బీజేపీ నేతలతో సమన్వయం లోపించిందని అంగీకరిస్తున్నారు. అయితే ఈ రోజు మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో తెలంగాణ జనసేన శ్రేణులు సంతోషపడేలా ప్రకటన చేశారు. తెలంగాణలో ఏడు నుండి 14 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్ధులు పోటీ చేస్తారని తెలిపారు పవన్ కళ్యాణ్. కొండగట్టు నుండి తెలంగాణలో రాజకీయం మొదలుి పెడతామని పవన్ పేర్కొన్నారు.
అయితే తెలంగాణలో బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తారా లేక ఆ పార్టీతో తెగ తెంపులు చేసుకుని అధికార టీఆర్ఎస్ తో పోటీ చేస్తారా అనే ఊహాగానాలు కూడా సాగుతున్నాయి. ఇంతకు ముందు జనసేనతో మిత్రపక్షంగా ఉన్న వామపక్షాలు తెలంగాణ మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతు పలికాయి. టీఆర్ఎస్ తో పవన్ కళ్యాణ్ కు విభేదాలు ఏమీ లేవు. సీఎం కేసిఆర్, మంత్రి కేటిఆర్ తో సన్నిహిత సంభంధాలు పవన్ కళ్యాణ్ కు ఉన్న నేపథ్యంలో ఆ దిశగా ఏమైనా అడుగులు వేస్తారా అనే ఊహాగానాలు సాగుతున్నాయి. ఇప్పటి వరకూ బీజేపీ తో పొత్తు ఉన్నప్పటికీ తెలంగాణ లో అధికార టీఆర్ఎస్ పై ఏనాడూ పవన్ కళ్యాణ్ విమర్శలు చేయలేదు. దీంతో టీఆర్ఎస్ కు దగ్గర అయ్యే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పరిస్థితులకు అనుగుణంగా తమ ఫందా మార్చుకుంటుంటామని పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై ఈ రోజే ప్రకటించినందున త్వరలోనే పొత్తుల అంశంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదే క్రమంలో ఏపిలో టీడీపీతో మరల పొత్తు ఉంటుందని ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ రోజు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ కావడంతో టీడీపీ, జనసేన పార్టీలు దగ్గర అవుతున్నాయనే సంకేతాలు వచ్చేశాయి. రాజకీయాల్లో శాశ్వత శతృవులు, శాశ్వత మిత్రులు ఉండరు అన్నట్లు ఇటు ఏపిలో గానీ అటు తెలంగాణలో గానీ జనసేన అడుగులు ఎలా ఉంటాయన్నది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.