NTR: తెలుగు సినిమా ప్రేక్షకుల ఆరాధ్య నటుడిగా దివంగత నందమూరి తారక రామారావు కీర్తి గడించారు. రాజకీయాల్లో వచ్చి టీడీపీని స్థాపించి, అధికారంలోకి తీసుకొచ్చి ఉమ్మడి ఏపీలో ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పరిపాలించి తనదైన ముద్ర వేశారు. 1996లో ఆయన మరణానంతరం చంద్రబాబు టీడీపీ పగ్గాలు చేపట్టి పార్టీ ప్రాభవాన్ని నిలబెట్టారు. అయితే.. 2014లో తెలంగాణ, ఏపీగా తెలుగు రాష్ట్రం విడిపోయి ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తే.. తెలంగాణలో గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. అయినా.. పార్టీపై, ఎన్టీఆర్ పై కార్యకర్తల అభిమానం అలానే ఉంది. ఇందుకు నిదర్శనంగా ఖమ్మం పట్టణంలో ఎన్టీఆర్ భారీ విగ్రహ ఏర్పాటుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. విగ్రహ ప్రారంభానికి ఎన్టీఆర్ మనవడు, హరికృష్ణ తనయుడు జూ.ఎన్టీఆర్ ను ముఖ్య అతిధిగా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఎన్టీఆర్ శతజయంతి..
ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా మే 28న ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్ పై చెరువు మధ్యలో భారీ ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకి ఏర్పాట్లు చేస్తున్నారు. 36 అడుగుల పొడవు, వెడల్పుతో వెయ్యి అడుగుల విస్తీర్ణం ఉండే బేస్మెంట్స్ పై.. 54 అడుగుల ఎత్తుతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. 2.3 కోట్ల వ్యయంతో నిజామాబాద్లో విగ్రహాన్ని తయారు చేయిస్తున్నారు. కృష్ణావతారంలో ఉన్న (NTR) ఎన్టీఆర్ విగ్రహం ఫొటోలు ఇప్పటికే వైరల్ అవుతున్నాయి. తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ విగ్రహ ఏర్పాటుకు చొరవ చూపుతున్నారు. అయితే.. విగ్రహ ప్రారంభానికి ఎన్టీఆర్ ను ప్రత్యేకంగా ఆహ్వానించడమే వార్తల్లో నిలుస్తోంది. ఇందుకు కారణం లేకపోలేదు.
ఎన్టీఆర్ ప్రధానాకర్షణగా..
తెలంగాణలో ప్రాభవం కోల్పోయిన టీడీపీకి పూర్వ వైభవం కోసం ఎన్టీఆర్ ను పార్టీలోకి తీసుకురావాలని చంద్రబాబుపై గతంలోనే ఒత్తిడి ఉంది. ప్రస్తుతం ఏపీలో ప్రతిపక్షంలో ఉండటంతో ఇక్కడా ఎన్టీఆర్ ను తీసుకురావాలనే డిమాండ్లు ఉన్నాయి. 2009 ఎన్నికల్లో టీడీపీకి స్టార్ క్యాంపెయినర్ గా ఎన్టీఆర్ చరిష్మా ఏంటో అందరికీ అర్ధమైంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో టీడీపీకి (NTR) ఎన్టీఆర్ ఆశాదీపంలా కనిపిస్తున్నారు. కానీ.. పొలిటికల్ ఎంట్రీపై ఎన్టీఆర్ ఎప్పుడూ స్పందించలేదు. అయితే.. ఎన్టీఆర్ పై మాత్రం రాజకీయ ఒత్తిడి ఉంది. ఈక్రమంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు ఆయన్ను ముఖ్య అతిధిగా ఆహ్వానిస్తున్నారనే వార్తలు.. నందమూరి కుటుంబంలో ఇంకా ఎవరి పేరు వార్తల్లో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.