KTR: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఇటీవల సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తన మంత్రివర్గ సహచరుడు అయిన ఈటల రాజేందర్ ను బాధ్యతల నుంచి తొలగిస్తూ ఆ శాఖ తన పరిధిలోకి తీసుకుంటూ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో నేటి నుంచి లాక్ డౌన్ విధిస్తున్నట్లు కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సమయంలో ఆయన కీలక బాధ్యతలను తన కుమారుడు కేటీఆర్ కు అప్పగించారని అంటున్నారు.
కేబినెట్ సమావేశంలోనే…
కరోనా మహమ్మారికి చెక్ పెట్టడంలో కీలకమైన వ్యాక్సిన్ విషయంలో రాష్ట్రస్థాయి టాస్క్ ఫోర్స్ నియామకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఏ రోజుకారోజు మందులు, వ్యాక్సిన్లను వేగవంతంగా సమకూర్చి, సరఫరా చేయడం కోసం మంత్రి కేటీఆర్ అధ్యక్షతన ఈ కమిటీ పనిచేస్తుంది. పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, సీఎంఓ నుండి సీఎం కార్యదర్శి, కోవిడ్ ప్రత్యేకాధికారి రాజశేఖర్ రెడ్డి ఈ టాస్క్ ఫోర్స్ లో సభ్యులుగా ఉంటారు.
లాక్ డౌన్ అమలు ఇలా…
మే 12వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల నుంచి.. 10 రోజులపాటు లాక్ డౌన్ విధించాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ప్రజల అవసరాల కోసం సడలింపు ఉంటుంది. కేవలం 4 గంటలపాటు మాత్రమే అన్నిరకాల షాపులు తెరిచి ఉంటాయి. మిగతా 20 గంటలపాటు లాక్ డౌన్ కఠినంగా అమల్లో ఉంటుంది. మే 20వ తేదీన క్యాబినెట్ తిరిగి సమావేశం అవుతుంది. లాక్ డౌన్ కొనసాగించే విషయంపై సమీక్షించి, తదుపరి నిర్ణయం తీసుకుంటుంది.