KTR: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన శ్వేతపత్రం తప్పుల తడక, అబద్దాల పుట్ట అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు (కేటిఆర్) విమర్శించారు. గత తొమ్మిదిన్నరేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని వివరిస్తూ తెలంగాణ భవన్ లో కేటిఆర్ స్వేదపత్రం పేరిట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పాలనను బద్నాం చేసేందుకు ప్రయత్నం చేస్తొందని అన్నారు. ప్రభుత్వం చేసిన ఆరోపణలు, విమర్శలకు అసెంబ్లీ వేదికగా సమాధానం చెప్పామన్నారు.
అసెంబ్లీలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చివరకి వాయిదా వేసుకొని అధికార పక్షం వెళ్లిపోయిందన్నారు కేటిఆర్. బాధ్యత గల పార్టీగా స్వేదపత్రం విడుదల చేస్తున్నామన్నారు. కోట్ల మంది చెమటతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్న తీరును వివరించేందుకే ఈ స్వేదపత్రం అని అన్నారు. కొత్త రాష్ట్రం ఏర్పటైన తర్వాత విధ్వంసం నుండి వికాసం వైపు.. సంక్షోభం నుండి సమృద్ధి వైపు తెలంగాణ అడుగులు వేసిందన్నారు. రాష్ట్రం ఏర్పడకముందు అన్ని రంగాల్లో కూడా తెలంగాణ పై వివక్ష నెలకొని ఉందన్నారు. ఎన్నో పోరాటాల తర్వాత ప్రత్యేక రాష్ట్రం కల సాకారమైందని అన్నారు. ఇప్పుడు కొందరు నేతలు తమ వల్లే తెలంగాణ వచ్చిందని చెబుతున్నారన్నారు.
రాష్ట్ర స్థూల రుణం రూ.3.17 లక్షలకోట్లు కాగా దాన్ని కాంగ్రెస్ నేతలు రూ.6.70 లక్షల కోట్లుగా చూపించే ప్రయత్నం చేశారని కేటిఆర్ ఆరోపించారు. ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చిన రుణాలను, గ్యారంటీ ఇవ్వని రుణాలను కూడా అప్పులుగా చూపుతున్నారన్నారు. రాష్ట్రానికి స్థూలంగా ఉన్న రుణాలు రూ.3,17,051 కోట్లు మాత్రమేననిచెప్పారు. లేని అప్పులు ఉన్నట్లుగా చూపి తిమ్మిని బమ్మిని చేస్తున్నారని విమర్శించారు. బట్ట కాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఆర్టీసీ, విద్యుత్, పౌర సరఫరాల్లో లేని అపు ఉన్నట్లుగా చూపిస్తున్నారన్నారు. పౌర సరఫరాల సంస్థకు ఇప్పటి వరకూ ఉన్న అప్పు రూ.22,029 కోట్లు మాత్రమేనని అన్నారు. నిల్వలు, కేంద్రం నుండి రావాల్సిన డబ్బులను దాచి అప్పులు ఎక్కువగా ఉన్నాయని చూపారన్నారు.
రాష్ట్రం ఏర్పడేనాటికి తెలంగాణ లో పేదరికం 21.92 శాతం ఉంటే ఇప్పుడు 5.8 శాతంకు తగ్గిందని చెప్పారు కేటిఆర్. గత పదేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం భారతదేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యామని కేటిఆర్ అన్నారు. 60 ఏళ్ల గోసను బీఆర్ఎస్ పాలనలో పదేళ్లలోనే అంతం చేశామన్నారు. తలసరి ఆదాయం 2013 – 13 లో రూ.1,12,162 లు ఉంటే 2022- 23 లో రూ.3,17,115 కోట్లుగా ఉందని తెలిపారు. జీఎస్డీపీ 2013 -14 సంవత్సరంలో రూ.4.51 లక్షల కోట్లు గా ఉండగా, 2022 – 23 లో రూ.13.27 కోట్లుగా ఉందని చెప్పారు.
అరవై ఏళ్లలో రాష్ట్రంలో 4,98,053 కోట్లు ఖర్చు చేశారన్నది శుద్ద అబద్దమని, జనాభా ఆధారంగా తెలంగాణ వాచా అంటూ తప్పుడు లెక్కలు చూపారన్నారు. పదేళ్లలో తెలంగాణలో రూ.13,72,930 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. విద్యుత్ రంగంలో తాము సృష్టించిన ఆస్తులు రూ.6,87,585 కోట్లు అని చెప్పారు. విద్యుత్ స్థాపిత సామర్థ్యాన్ని 7,778 మెగావాట్ల నుండి 19,464 మెగావాట్ల కు పెంచామని కేటిఆర్ వివరించారు. రాష్ట్రానికి అస్థిత్వమే కాదు..ఆస్తులు కూడా సృష్టించామని తెలిపారు.
ఎక్కువ వేతనాలు, ఉద్యోగాలు ఇచ్చి తాము చెప్పుకోలేకపోయామన్నారు కేటిఆర్. ప్రతి గెలుపు, ఓటమిలోనూ పాఠాలు ఉంటాయని, ఈ ఓటమి తమకు ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని అన్నారు. వంద రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. నిరుద్యోగ భృతిపై నాలుక మడత వేశారని విమర్శించారు. ఆరు గ్యారంటీలే కాదు.. కాంగ్రెస్ 412 హామీ లు ఇచ్చిందని అన్నారు. సుపరిపాలన అందిస్తారా.. కక్షసాధిస్తారా అన్నది వారి ఇష్టమని, తాము దేనికైనా సిద్దంగానే ఉన్నామని కేటిఆర్ పేర్కొన్నారు.
Chandrababu Prashant Kishor: బాబోరిలో భయం ..! అందుకే అవసరం అయ్యాడా పీకే..??