హైదరాబాద్ లో దారుణ ఘటన జరిగింది. ఓ మైనర్ బాలికకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి యువకులు సామూహిక అత్యాచారానికి ఓడిగట్టారు. ఈ ఘటన పాతబస్తీలో జరిగింది. ఆ బాలికను రెండు రోజుల పాటు ఓయో లాడ్జిలో ఉంచి యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తొలుత ఆమెను కిడ్నాప్ చేసిన యువకులు హైదరాబాద్ లోని రెండు హోటళ్లకు బాలికను మార్చుతూ ఆపై ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. రెండు రోజుల పాటు అఘాయిత్యానికి పాల్పడిన యువకులు ఆ బాలికను లాడ్జిలోనే వదిలి వెళ్లిపోయారు.
ఈ తరుణంలోని తమ కుమార్తె అదృశ్యమైందంటూ ఆ బాలిక తల్లిదండ్రులు ఈ నెల 13న డబీర్ పురా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ ఇద్దరు యువకులు బాలికకు తెలిసిన వారేనని పోలీసులు తెలిపారు. తెలిసిన వారు కావడంతో బాలిక వారి మాటలు నమ్మి వెంట వెళ్లి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. రెయిన్ బజారుకు చెందిన సయ్యద్ రావిన్ష్, రియాసత్ అహ్మద్ లను అరెస్టు చేసి వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.