BRS MLA Candidate: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులు ఓటర్లను ఆకట్టుకునేందుకు, గెలుపు కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. గ్రామాల్లో ప్రజలకు అవి చేస్తాం.. ఇవి చేస్తాం అంటూ హామీ లు ఇవ్వడంతో పాటు ఓటుకు నోటు పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని, పనులు చేస్తామని, ప్రజలకు అందుబాటులో ఉంటామని హామీ ఇస్తూ తనకే ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ఉంటారు. అయితే తెలంగాణ ఎన్నికల్లో ప్రచారానికి మరి కొద్ది గంటలు ముగియనున్న సమయంలో ఓ బీఆర్ఎస్ అభ్యర్ధి ఎమ్మోషనల్ బ్లాక్ మెయిలింగ్ కామెంట్స్ చేయడం తీవ్ర సంచలనం అయ్యింది.
హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్ధి పాడి కౌశిక్ రెడ్డి తన భార్య, కుమార్తెతో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు ఓటు వేసి దీవిస్తే నాలుగో తేదీ జైత్ర యాత్ర లేదంటే మా కుటుంబ సభ్యుల శవయాత్రేనని అన్నారు. దీవించకపోతే తాను తన భార్య, కుమార్తె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జైత్ర యాత్రకు లేదా శవయాత్రకు రండి అంటూ పిలుపు నిచ్చారు. సాదుకుంటారా.. చంపుకుంటారా మీ ఇష్టం అంటూ మాట్లాడారు. పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ప్రత్యర్ధి పార్టీ నేతలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నారు. కాగా, ఈ ఎమ్మెషనల్ సెంటిమెంట్ వ్యాఖ్యలకు ఓట్లు రాలతాయా లేదా అనేది తెలియాలంటే డిసెంబర్ 4వ తేదీ వరకూ ఆగాల్సిందే.
పాడి కౌశిక్ రెడ్డి 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలైయ్యారు. నాటి టీఆర్ఎస్ అభ్యర్ధి ఈటల రాజేందర్ పై 43,719 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2021 లో ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి, బీఆర్ఎస్ కి రాజీనామా చేసిన నేపథ్యంలో జరిగిన ఉప ఎన్నికల్లో కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ టికెట్ ఆశించగా, ఇవ్వలేదు, దీంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు కొరకు కౌశిక్ రెడ్డి కృషి చేసినప్పటికీ బీఆర్ఎస్ అభ్యర్ధి గా నిలిచిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ 23, 855 ఓట్లతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధిగా కౌశిక్ రెడ్డి, బీజేపీ అభ్యర్ధిగా ఈటల రాజేందర్, కాంగ్రెస్ అభ్యర్ధిగా వడితాల ప్రణవ్ బరిలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ బీఆర్ఎస్, బీజేపీ మధ్యనే ఉన్నట్లుగా తెలుస్తొంది.