Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలియజేశారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుండి సాధ్యమైనంత మద్దతు ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. గురువారం తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో పీఎం మోడీ ట్విట్టర్ వేదికగా సందేశం ఇచ్చారు. “తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ రేవంత్ రెడ్డి గారికి అభినందనలు. రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తానని నేను హామీ ఇస్తున్నాను” అని మోడీ పేర్కొన్నారు.
హైదరాబాద్ ఎల్బీ స్టేడియం లో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా, మల్లు భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటు మంత్రులుగా కొండా సురేఖ, సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్శింహ, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావులచే గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక తదితర ప్రముఖులు హజరైయ్యారు. రేవంత్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు.,
ఎన్నికల సమయంలో రాజకీయంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ .. కేంద్రం తరపున రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తానంటూ ట్వీట్ చేసి తన గొప్ప మనసును చాటుకున్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని ఎన్నికల సమయంలో బీజేపీ నేతలు ప్రసంగాలు చేసిన సంగతి తెలిసిందే.
CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తొలి ప్రసంగంలోనే కీలక ప్రకటన