Road Accident: తెలంగాణలో వేరువేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు దుర్మరణం పాలైయ్యారు. పలువురు గాయపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దుండుమల్కాపూర్ వద్ద కూలీలతో వెళుతున్న ఆటోను తేజస్ ఫుడ్ ఇండస్ట్రీస్ కు చెందిన ప్రైవేటు బస్సు ఢీకొట్టిన ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరి కొందరు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు వెంటనే హయత్ నగర్ లోని సన్ రైజ్ ఆసుపత్రికి తరలించారు. అసుపత్రిలో చికిత్స పొందుతూ నాగలక్ష్మి, వరకాంతం అనసూయ(50), ధనలక్ష్మి (30), దేవరపల్లి శిరీష అనే మహిళలు మృతి చెందారు. వీరంతా పారిశ్రామిక వాడలో పని చేస్తున్నట్లు సమాచారం. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండలంలోని గుండంపల్లి గ్రామ క్రాస్ రోడ్డు వద్ద జరిగిన రోడుడ్ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. శ్రీనివాస్ (29), అఖిల్ (22), సతీష్ (22) అనే ముగ్గురు యువకుల కారులో దివావర్ పూర్ నుండి రాంపూర్ వెళుతుండగా, బైంసా నుండి నిర్మల్ వైపు వేగంగా వస్తున్న లారీ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అఖిల్, శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందగా, సతీష్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. అతన్ని జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి ప్రధమ చికిత్స అనంతరం హైదరాబాద్ తరలించారు. మరో రోడ్డు ప్రమాదం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో జరిగింది. ట్రాక్టర్, కారు ఢీకొన్న ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, కారులో ఉన్న వారికి స్వల్పగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.