Telangana BJP: తెలంగాణ 3వ శాసనసభ శనివారం ఉదయం కొలువుదీరనుంది. ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వ్యవహరించనున్నారు. అక్బరుదదీన్ ప్రొటెం స్పీకర్ గా ఉంటే .. తాము అసెంబ్లీ సమావేశానికి హజరుకాబోమని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం వీడియో సందేశం విడుదల చేశారు.
‘అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకర్ అయితే.. నేను ప్రమాణ చేయను. బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరూ శనివారం ప్రమాణం చేయరు. అక్బరుద్దీన్ కు ప్రొటెం స్పీకర్ గా ఎందుకు అవకాశం ఇచ్చారు. ఆయన కంటే అసెంబ్లీలో ఎందరో సీనియర్లు ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ కూడా ఇలాగే చేసింది. రేపటి అసెంబ్లీ సమావేశాలను బీజేపీ బహిష్కరిస్తొంది’ అని రాజాసింగ్ తెలిపారు.
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ తరపున ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలుపొందిన సంగతి తెలిసిందే. వీరంతా పూర్తి స్థాయి స్పీకర్ ఎన్నికైన తర్వాతనే ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయనున్నారు. మరో పక్క రేపు కొత్తగా ఎన్నికైన 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమావేశం అవుతారు. శనివారం ఉదయం పార్టీ కార్యాలయంలో సమావేశం ఉంటుందని బీజేపీ ఎమ్మెల్యేలకు చెప్పారు. ఈ సమావేశంలో బీజేపీ శాసనసభ పక్షనేత ను బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు.
రేస్ లో ముగ్గురు
బీజేపీ శాసనసభాపక్ష నేత రేసులో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ వరుసగా మూడు సార్లు గోషామహాల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి గెలిచారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుండి రాజాసింగ్ ఒక్కరే విజయం సాధించారు. ఆ తర్వాత ఉప ఎన్నికల్లో రఘునందనరావు, ఈటల రాజేందర్ లు గెలిచినప్పటికీ రాజాసింగ్ యే బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఉన్నారు. అయితే నిర్మల్ నుండి 2009లో ప్రజా రాజ్యం పార్టీ తరపున, ఈ ఎన్నికల్లో బీజేపీ తరపున గెలిచిన సీనియర్ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి ప్లోర్ లీడర్ రేసులో ఉన్నారు. మరో పక్క కామారెడ్డిలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసిఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిపై విజయం సాధించిన ఎమ్మెల్యే వెంకట రమణరెడ్డి పేరుని కూడా పార్టీ అధిష్టానం పరిశీలన చేస్తొందన్న ప్రచారం జరుగుతోంది.
CM Revanth Reddy: సీఎం హోదాలో మొదటి సారి హస్తినకు వెళ్లిన రేవంత్ రెడ్డి ..ఎందుకంటే..?