CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నిన్న ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. సీఎం గా రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క, మరో పది మంది మంత్రులతో గవర్నర్ తమిళిసై ప్రమాణ స్వీకారం చేయడంతో తెలంగాణ ప్రభుత్వం కొలువు తీరింది. రేవంత్ రెడ్డి పరిపాలనా పగ్గాలు చేపట్టిన వెంటనే తన మార్క్ పాలనకు శ్రీకారం చుట్టారు.
గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగా ప్రజల నుండి నేరుగా అర్జీలు స్వీకరించే కార్యక్రమాన్ని చేపట్టారు. సీఎం అధికారిక నివాసం ప్రగతి భవన్ పేరును జ్యోతిరావుపూలే ప్రజాభవన్ గా మార్చి ప్రతి శుక్రవారం ప్రజాదర్భార్ నిర్వహించనున్నట్లు తెలిపారు. చెప్పినట్లుగా ఇవేళ ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఆ తర్వాత సచివాలయంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు.
కాగా, సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలి సారిగా ఇవేళ ఢిల్లీకి పయనమై వెళ్లారు. మంత్రులకు శాఖల కేటాయింపు అంశంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో ఆయన చర్చించనున్నారు. 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసి 24 గంటలు దాటినా ఇంత వరకూ శాఖలు కేటాయింపు జరగలేదు. పార్టీ అధిష్టానంతో చర్చించిన తర్వాత మంత్రులకు శాఖల కేటాయింపు జరిగే అవకాశం ఉందని అంటున్నారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతోనూ రేవంత్ భేటీ కానున్నారు. అయితే ఢిల్లీ తొలి పర్యటనలో రాష్ట్రానికి కేంద్రం నుండి రావాల్సిన నిధులపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ అవుతారా లేదా అనే దానిపై ఇంత వరకూ స్పష్టత లేదు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పీఎం మోడీ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలియజేస్తూ కేంద్రం నుండి రాష్ట్రాభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు.
మోడీ ట్విట్ కు రేవంత్ స్పందిస్తూ ధన్యవాదాలు కూడా తెలిపారు. రాష్ట్ర అర్ధిక పరిస్థితి, కేంద్రం నుండి రావాల్సిన బకాయిలు, ఇతర అంశాలపై ఒక సారి అధికారులతో సమీక్ష జరిపిన తర్వాత ప్రధాని మోడీని కలుస్తురా లేక ఇవేళ పీఎం అపాయింట్మెంట్ కోరతారా అనేది వేచి చూడాలి. మరో పక్క కాంగ్రెస్ అగ్రనేతల భేటీలో పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా అంశంపైనా చర్చించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాల పేర్కొంటున్నాయి.
Supreme Court: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ మళ్లీ వాయిదా