Supreme Court: స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు కోరుతూ దాఖలైన పిటిషన్ పై విచారణ మళ్లీ వాయిదా పడింది. వచ్చే ఏడాది జనవరి 19వ తేదీకి సుప్రీం కోర్టు ధర్మాసనం వాయిదా వేసింది. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించగా, పిటిషన్ పై గతంలో వాదనలు విన్న ధర్మాసనం ..తదుపరి విచారణ నేటికి వాయిదా వేసింది. ఈరోజు జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మల ధర్మాసన పిటిషన్ పై మరో సారి విచారణ చేపట్టింది.పిటిషన్ పై విచారణ సందర్భంలో స్కిల్ కేసుకు సంబంధించి క్వాష్ పిటిషన్ పై ఇప్పటికీ తీర్పు వెలువరించలేదని చంద్రబాబు తరపు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు.
17ఏ వ్యవహారంపై తీర్పు ఇస్తే మాత్రం వాయిదా వేయాలని చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్ సాల్వే కోరారు. వాయిదా వేయకుంటే విచారణ తేదీని చెప్పాలని సాల్వే కోరారు. నోటీసులు ఇచ్చినా ఇంకా కౌంటర్ దాఖలు చేయలేదని ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది ధర్మాసనానికి తెలియజేయగా, కౌంటర్ దాఖలు చేసేందుకు సిద్దంగానే ఉన్నామని సాల్వే తెలిపారు. అయితే ఈ అంశం 17ఏ తీర్పుతో ముడిపడి ఉందని సాల్వే కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
సాల్వే వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం .. విచారణ జనవరి మూడో వారంలో చేపడతామని తెలిపింది. అయితే తేదీ ఖరారు చేయాలాని సాల్వే ధర్మాసనాన్ని కోరగా, ఆయన విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణను జనవరి 19వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఈ లోగా కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదిని కోర్టు ఆదేశించింది. ఆ కౌంటర్ కు రిజాయిండర్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వం తరపు న్యాయవాదికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.