BJP: లోక్ సభ ఎన్నికల్లో పొత్తులపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్ష పార్టీ జనసేనకు పొత్తులో భాగంగా ఎనిమిది స్థానాలను కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే జనసేన అభ్యర్ధులు ఎనిమిది స్థానాల్లో కనీస ఓట్లు కూడా సాధించలేదు. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికలకు సంబంధించి పొత్తులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులు ఉండవని స్పష్టం చేశారు కిషన్ రెడ్డి. తెలంగాణలో ఒంటరిగానే బీజేపీ పోటీ చేస్తుందని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ తో సమాన పోరాటాలు ఉంటాయన్నారు. అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ముందుకు వెళ్లాలని సూచించారు. తెలంగాణలో రాజకీయంగా బీజేపీకి మంచి అవకాశం ఉందని చెప్పారు. సర్వే సంస్థలకు కూడా అందని విధంగా ఫలితాలు ఉంటాయని జోస్యం చెప్పారు.
శనివారం నుండి తెలంగాణలో వికసిత్ భారత్ కార్యక్రమంపై ప్రచారం మొదలుపెట్టాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. కొత్తగా ఎన్నికైన 8 మంది ఎమ్మెల్యేలు రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తారని చెప్పారు. కేంద్రంలో మూడో సారి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడుతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల చివరి వారంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణకు రానున్నారని చెప్పారు.
ఇవేళ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షుడు, ఇన్ చార్జిలు, లోక్ సభ నియోజకవర్గాల ఇన్ చార్జిలతో సమావేశం అయ్యారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి తరుణ్ చుగ్ ఈ కార్యక్రమానికి ముఖ్ అతిధిగా హజరు కాగా వికసిత్ భారత్, విశ్వకర్మ పథకాలపై సమావేశంలో చర్చించారు. లోక్ సభ ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్దం కావాలని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. కిషన్ రెడ్డి ప్రకటనతో జనసేనను పక్కన పెట్టినట్లేనా అన్న టాక్ నడుస్తొంది.
MLC Shaik Sabjee: రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం .. జగన్, చంద్రబాబు సంతాపం