Revanth Reddy: తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు నిన్న సాయంత్రం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో ఆయనకు ఆంధ్రభవన్ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం పార్టీ అగ్రనేతలను కలిసి తనను సీఎల్పీ నేతగా ఎన్నికయ్యేలా సహకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. నిన్న రాత్రి డీకే శివకుమార్ తో భేటీ అయిన రేవంత్ రెడ్డి మంత్రివర్గ కూర్పుపై చర్చించినట్లుగా తెలుస్తొంది.
బుధవారం ఉదయం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్సి కేసీ వేణుగోపాల్ తో ఆయన సమావేశం అయ్యారు. వారికి బొకే అందజేసి కృతజ్ఞతలు తెలియజేశారు. కొద్ది సేపటిలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో ఆయన సమావేశం కానున్నారు. తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నారు. రాష్ట్రంలో మంత్రివర్గ ఏర్పాటు, ఇతర అంశాలపైనా సోనియా, రాహుల్ తో రేవంత్ చర్చించనున్నారు.
రేపు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గురువారం (7వ తేదీ) ఉదయం 10.28 గంటల మూహూర్తానికి ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేవంత్ రెడ్డి సహా 9 లేదా 18 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి అయిన తర్వాత నుండి సీఎల్పీ నేత ఎంపికకు సంబంధించి నెలకొన్న సందిగ్ధతకు నిన్న సాయంత్రం కేసి వేణుగోపాల్ ప్రకటనతో తెరపడింది.
మరో పక్క ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లు ప్రారంభమైయ్యాయి. అధికారులు, కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రమాణ స్వీకారానికి సంబందించి ఏర్పాట్లు పరిశీలన చేస్తున్నారు. దాదాపు 9 సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం తొణికిసలాడుతోంది. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు ప్రమాణ స్వీకారానికి తరలివచ్చే అవకాశం ఉండటంతో అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు.
YS Jagan: నేడు అంబేద్కర్ వర్థంతి .. నివాళులర్పించిన సీఎం వైఎస్ జగన్