Revanth Reddy: తెలంగాణలో ఎన్నికల సంగ్రామం కొనసాగుతున్న వేళ ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. నిన్న కాంగ్రెస్ నేత తుమ్మల నాగేశ్వరరావు గృహంలో, ఇవేళ ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఎన్నికల తరుణంలో కాంగ్రెస్ నేతలే లక్ష్యంగా కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు నిర్వహించడాన్ని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.
ట్విట్టర్ వేదికగా ఆయన స్పందిస్తూ.. నేడు పొంగులేటి, నిన్న తుమ్మల, అంతకు ముందు పలువురు కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ దాడులు దేనికి సంకేతం అని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతల ఇళ్లపై ఐటీ రైడ్స్ ఎందుకు జరగడం లేదని అడిగారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సునామీ రాబోతోందని స్పష్టమైన సమాచారం రావడంతో మోడీ – కేడీ బెంబేలెత్తుతున్నారన్నారు. ఆ సునామీని ఆపడానికి చేస్తొన్న కుతంత్రం ఇది అని పేర్కొన్నారు. ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాననీ, నవంబర్ 30 న కాంగ్రెస్ సునామీలో కమలం, కారు గల్లంతవ్వడం ఖాయమని అన్నారు రేవంత్.
ఇవేళ పాలేరు కాంగ్రెస్ అభ్యర్ధిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి నామినేషన్ దాఖలు చేయనుండగా, వేకువజాము నుండి ఆయన నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. పొంగులేటి నివాసంలో జరుగుతున్న ఐటీ దాడులను ఖండిస్తూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు నిరసనకు దిగారు. బీజేపీ, బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ నుండి పొంగులేటి, తుమ్మల కాంగ్రెస్ పార్టీ లో చేరిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు నేతల చేరికతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయ్యింది. త్వరలో తన ఇల్లు, కార్యాలయాలతో పాటు తన మిత్రులు, బంధువుల ఇళ్లపై ఐటీ, ఈడీ దాడులు జరిగే అవకాశం ఉందని పొంగులేటి అనుమానం వ్యక్తం చేసిన 24 గంటల వ్యవధిలోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
Ponguleti Srinivasa Reddy: పొంగులేటి ముందే ఊహించారు .. ఐటీ, ఈడీ అధికారులు వచ్చేశారు