Ponguleti Srinivasa Reddy: ఖమ్మం మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసాల్లో ఐటీ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని నందిహిల్స్, ఖమ్మంలోని ఆయన నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. అదే విధంగా పాలేరులోని క్యాంపు ఆఫీసులోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. గురువారం వేకుమజామున ఎనిమిది వాహనాల్లో ఐటీ అధికారులు పొంగులేటి నివాసానికి చేరుకున్నారు. ఐటి అధికారులు పొంగులేటి కుటుంబ సభ్యుల నుండి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పొంగులేటి అనుచరుల సెల్ ఫోన్ లు కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఖమ్మం, హైదరాబాద్ లోని పొంగులేటికి చెందిన ఇళ్లు, కార్యాలయాలతో పాటు ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లల్లోనూ ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి. కాగా, ఈరోజు పొంగులేటి పాలేరు కాంగ్రెస్ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ క్రమంలో ఏర్పాట్లు చేసుకోగా అధికారులు సోదాలు ప్రారంభించడం పై ఆయన అనుచరులు, కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక, త్వరలోనే తనపై ఈడీ, ఐటీ దాడులు జరిగే అవకాశం ఉందని పొంగులేటి బుధవారం మీడియా సమావేశంలో పేర్కొన్నారు. తన ఇళ్లు, కార్యాలయాలతో పాటు తన అనుచరులు, బంధువుల ఇళ్లపై దాడులు జరిగే అవకాశం ఉందని, అన్నింటికీ సిద్దపడే ఉన్నామని అన్నారు. పొంగులేటి ప్రకటించిన 24 గంటల వ్యవధిలోనే ఈ దాడులు జరగడం గమనార్హం.
మరో పక్క పొంగులేటి నివాసంలో అధికారుల సోదాల విషయం తెలియడంతో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు పొంగులేటి నివాసానికి చేరుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డిని నామినేషన్ కు పంపించాలని డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా పొంగులేటి, కాంగ్రెస్ విజయాన్ని అడ్డుకోలేరని ఆయన అనుచరులు చెబుతున్నారు.