Telangana Elections: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం హోరాహోరీగా సాగుతోంది. ఓ పక్క నామినేషన్ ల పర్వం ఊపందుకుంది. మరో పక్క ప్రధాన రాజకీయ పార్టీలు అన్నీ ప్రచారంలో దూకుడు పెంచాయి. మూడవ సారి అధికారాన్ని కైవశం చేసుకుని హాట్రిక్ రికార్డు కొట్టాలని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. హెలికాఫ్టర్ లో పర్యటిస్తూ నిత్యం మూడు సభల్లో పాల్గొంటున్నారు. మరో పక్క బీఆర్ఎస్ పార్టీని ఎలాగైనా ఓడించి ఈ సారి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్, బీజేపీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.
బీజేపీ తరపున ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రచారాలకు వస్తుండగా, బీజేపీతో పొత్తులో పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా రంగంలోకి దిగారు. ఇటు కాంగ్రెస్ తరపున స్టార్ క్యాంపెయినర్లుగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే తో పాటు కర్ణాటక నుండి డిప్యూటి సీఎం, ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ప్రచారాలు నిర్వహించారు. టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిత్యం వివిధ నియోజకవర్గాల్లోని ఎన్నిక ప్రచార సభల్లో పాల్గొంటున్నారు.
అయితే ఇటీవల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఉచిత విద్యుత్ హామీపై చేసిన టంగ్ స్లిప్ వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు ఆస్త్రంగా మారింది. కర్ణాటకలో తమ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి 5 గంటల ఉచిత విద్యుత్ ఇస్తొందని నోరు జారారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల విద్యుత్ అని చెబుతున్నా ఎక్కడా ఇవ్వడం లేదని తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 24 గంటల విద్యుత్ ఇస్తామని తెలంగాణ కాంగ్రెస్ నేతలు హామీ ఇస్తుంటే .. డీకే మాత్రం తాము అయిదు గంటల విద్యుత్ ఇస్తున్నామని ప్రకటించడం పార్టీ నేతలు అవాక్కయ్యారు. అప్పటికే అప్రమత్తమైన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డికే శివకుమార్ వ్యాఖ్యల అనువాదాన్ని నిలుపుదల చేశారు.
డీకే శివకుమార్ అయిదు గంటల విద్యుత్ వ్యాఖ్యల వీడియోను బీఆర్ఎస్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తొంది. మరో పక్క కేసిఆర్, ఆ పార్టీ నేతలు డీకే శివకుమార్ వ్యాఖ్యలను కోడ్ చేస్తూ తమ ప్రభుత్వం 24 గంటల విద్యుత్ ఇస్తుంటే కాంగ్రెస్ అయిదు గంటలే ఉచిత విద్యుత్ ఇస్తుందంట, రైతులకు 24 గంటలు విద్యుత్ ఇచ్చే బీఆర్ఎస్ కావాలా.. అయిదు గంటలే ఇస్తానంటున్న కాంగ్రెస్ కావాలా అని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంటు కట్ అని, అందుకు డీకే వ్యాఖ్యలే నిదర్శనమని బీఆర్ఎస్ ప్రచారం మొదలు పెట్టింది. దీంతో శివకుమార్ వచ్చి ఇక్కడ ఎన్నికల ప్రచారంలో మాట్లాడితే తమకు నష్టం జరుగుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్ధులు ఆందోళన చెందుతున్నారు. డీకే శివకుమార్ ను మళ్లీ ప్రచారానికి తీసుకురావద్దు అంటూ అభ్యర్ధులు విజ్ఞప్తి చేస్తున్నారుట.
మరో పక్క తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి శివకుమార్ వచ్చిన సమయంలో కర్ణాటక ప్రజా పనుల శాఖ మంత్రి సతీశ్ జార్కిహోళి తన వర్గం ఎమ్మెల్యేలతో ప్రత్యేక క్యాంప్ ఏర్పాటు చేసే ఆలోచన చేయడం ఆందోళన కల్గించింది. ఆ తర్వాత పార్టీ అధిష్టానం పెద్దలు రంగంలోకి కర్ణాటక కాంగ్రెస్ లో నెలకొన్న గ్రూపు విభేదాలపై చర్చలు జరపడంతో వివాదం సద్దుమణిగింది. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుంటే మరో పక్క తన సీటుకే ఎసరు వచ్చే పరిస్థితులు ఏర్పడటంతో డీకే శివకుమార్ ఆలోచనలో పడ్డారుట.
Telangana Elections: టికెట్ దక్కలేదన్న మనస్థాపంతో సీనియర్ కాంగ్రెస్ నేత ఆత్మహత్యాయత్నం