Barrelakka Sirisha: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో ఉన్న ప్రముఖ యూట్యూబర్ కర్నే శిరీష అలియాస్ బర్రెలక్కకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆమెకు తగిన భద్రత కల్పించాలని డీజీపీకి హైకోర్టు ఆదేశించింది. కొల్లాపూర్ నియోజకవర్గం ఎన్నికల బరిలో నిలిచిన బర్రెలక్క నిరుద్యోగుల ప్రతినిధిగా నిర్వహిస్తున్న ప్రచారానికి విశేష స్పందన లభిస్తొంది. ఆమె నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆమె సోదరుడిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. పలువురు ఆమెను పోటీ నుండి తప్పుకోవాలంటూ బెదిరింపు కాల్స్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో తనకు తగిన భద్రత కల్పించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో బర్రెలక్క పిటిషన్ దాఖలు చేశారు. బర్రెలక్క పిటిషన్ ను స్వీకరించిన హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. బర్రెలక్క తరపు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. అమెపై జరిగిన దాడిపై వివరిస్తూ అందుకు సంబంధించి ఆధారాలను కోర్టుకు చూపించారు. బర్రెలక్క తరపు న్యాయవాదుల వాదనలు విన్న హైకోర్టు ఆమెకు తగిన సెక్యురిటీ కల్పించాలని ఆదేశించింది. ఆమె పబ్లిక్ మీటింగ్ లకు కూడా ఎన్నికల కమిషన్, డీజీపీ భద్రత కల్పించాలని హైకోర్టు తెలిపింది.
ఎన్నికలు పూర్తి అయ్యే వరకూ ఆమెకు పూర్తి భద్రత ఎన్నికల కమిషన్, రాష్ట్ర డీజీపీ దేనని తెలిపింది. కేవలం గుర్తింపు ఉన్న పార్టీలు, అభ్యర్ధులకే కాకుండా సాధారణ అభ్యర్ధులకు కూడా భద్రత కల్పించాలని తీర్పు వెల్లడించింది. ఎన్నికల బరిలో నిలిచిన వారికి ముప్పు ఉందని భావిస్తే వారికి కూడా భద్రత ఏర్పాట్లు చేయాలని సూచించింది. బర్రెలక్కతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు సెక్యురిటీ కల్పించాలని ఈసీ, డీజీపీలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Supreme Court: జగన్, సీబీఐకి నోటీసులు జారీ చేసిన సుప్రీం కోర్టు