Etela rajender: మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరిక దాదాపు ఖాయం అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రంలోని పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి లతో మాట్లాడిన ఈటల రాజేందర్ ఢిల్లీకి వెళ్లి పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాతోనూ భేటీ అయ్యారు. తనకు ఉన్న సందేహాలను నివృత్తి చేసుకున్నారు. నేడో రేపో టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఈటల బీజేపీతో చేరుతున్న అంశంపై ఆ పార్టీ నాయకురాలు విజయశాంతి ట్విట్టర్ వేదికగా స్పందించారు.
కాంగ్రెస్ నుండి గెలిపించిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్కి వెళ్లిపోతారనే భావం తెలంగాణ ప్రజల్లో ఇప్పటికే పూర్తిగా నిరూపితం అయ్యిందన్న విజయశాంతి.. ఉద్యమకారుల ఆత్మగౌరవం, తెలంగాణ ప్రజల భవిష్యత్తు రెండూ బీజేపీతోనే నిలబడతాయనేది స్పష్టమైన నిజమని పేర్కొన్నారు.
Read More: Ts High court: రేవంత్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు..!!
తమ్ముడు ఈటల రాజేందర్ బీజేపీ వైపు అడుగులు వేయడాన్ని సరైన నిర్ణయంగా అభివర్ణించారు. బీజెపీ వైపు అడుగులు వేస్తుండటం పట్ల అభినందనలు తెలియజేశారు విజయశాంతి. తెలంగాణలో టీఆర్ఎస్ ను ఎదిరించి నిలిచి, గెలిచే సత్తా, సామర్థ్యం బీజేపీకి మాత్రమే ఉన్నాయనేది ఇవ్వాళ తిరుగులేని వాస్తవమని అన్నారు.
గతంలో టీఆర్ఎస్ లో పని చేసి తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రచార కమిటీ చైర్ పర్సన్ గా బాధ్యతలు నిర్వహించిన విజయశాంతి జీహెచ్ఎంసీ ఎన్నికల తరువాత బీజేపీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. మరో పక్క ఈటల వ్యవహారాన్ని టీఆర్ఎస్ అంత సీరియస్ గా తీసుకున్నట్లు కనబడటం లేదు. పొమ్మనలేక పొగ బెట్టారు అన్న టాక్ వినబడుతోంది. భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో మంత్రి వర్గం నుండి ఈటలను తొలగించిన కేసిఆర్ సర్కార్ ఆయనను ఇంకా పార్టీ నుండి సస్పెండ్ చేయలేదు. మంత్రి వర్గం నుండి బర్తరఫ్ అయిన తరువాత కూడా ఈటల ఇంకా పార్టీకి రాజీనామా చేయలేదు.