(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటునకు స్పష్టమైన వైఖరితోనే ఉన్నారు. కేంద్రం దీనికి అడ్డు చెప్పాలను కోవడం లేదు. సహకరించడానికీ సిద్ధంగానే ఉంది. వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. కానీ పలు సాంకేతిక అంశాలతో ఈ వ్యవహరం కోర్టు చేరడంతో పరిపాలనా రాజధాని విశాఖకు తరలింపు ఆలస్యం అవుతోంది. ప్రధానంగా ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే మూడు రాజధానుల ఏర్పాటులో న్యాయపరమైన చిక్కులకు కారణం ఏపి పునర్విభజన చట్టంలో పేర్కొన్న క్లాజులేనని అంటున్నారు. మూడు రాజధానులను ఏర్పాటు చేయాలంటే పునర్విభజన చట్టంలో మార్పులు చేయాల్సి ఉంటుంది అన్న కొత్త వాదన తెరపైకి వస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిపాలనా వికేంద్రీకరణ విషయంలో సరైన కసరత్తు చేయకుండా మూడు రాజధానుల ప్రక్రియకు శ్రీకారం చుట్టడం వల్ల పలు నిబంధనలు ప్రతిభంధకాలుగా మారాయని భావిస్తున్నారు.
రాష్ట్రపతి, కేంద్రం నోటిఫై చేస్తేనే మూడు రాజధానుల ఏర్పాటుకు గానీ, రాజధాని పేరు మార్పునకు గానీ అవకాశం ఉంటుందని అంటున్నారు న్యాయనిపుణులు. ఇటీవల సుప్రీం కోర్టు న్యాయవాది శ్రీనివసరావు ఒ చర్చా గోష్టిలో మాట్లాడుతూ విభజన చట్టం ప్రకారం శాసన, కార్యనిర్వహక, న్యాయ వ్యవస్థలు ఒకే చోట ఉండాలన్నారు. రాజధాని మార్చాలంటే ముందుగా కేంద్రం విభజన చట్టంలో నోటిఫై చేయాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఆర్టిక్టల్ 4 ప్రకారం పాలన ఎక్కడి నుండి జరగాలన్నది రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొనబడి ఉందన్నారు. కేవలం వికేంద్రీకరణ చట్టం ప్రకారంతోనే రాజధాని తరలింపు కుదరని ఆయన వెల్లడించారు.
మరో వైపు మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి రాజధాని రైతుల పక్షాన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే కుమార్తె, మరో సుప్రీం కోర్టు న్యాయమూర్తి నారిమన్ కుమారుడు వాదిస్తుండటం ఆసక్తిని కల్గిస్తోంది. రాజధాని కేసుల్లో విభజన చట్టం ఉల్లంఘనలు ఉన్నందునే వీరు ఈ పిటిషన్లపై ఆసక్తి చూపుతున్నారని అంటున్నారు. రాజధాని రైతుల పక్షాన వీరు వాదిస్తున్నందున సుప్రీం కోర్టులో ఈ కేసులపై తాము విచారణ చేయడం సరికాదంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డేతో పాటు న్యాయమూర్తి నారిమన్ లు తప్పుకోవడం తీవ్ర సంచలనంగా మారింది.
రాజధాని తరలింపు అంశానికి సంబంధించి ప్రస్తుతం హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు ఈ నెల 21వ తేదీ వరకూ ఉన్నాయి. ఆ తరువాత హైకోర్టు రోజు వారీ విచారణ జరిపి తీర్పు వెల్లడించనున్నది. అయితే ఇక్కడ హైకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తే రాజధాని రైతులు సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. అదే విధంగా రాజధాని రైతులకు అనుకూలంగా తీర్పు వస్తే ఏపి ప్రభుత్వం సుప్రీం కోర్టులో అపీల్ కు వెళుతుంది. ఇప్పటికే తొమ్మిది నెలలుగా సాగుతున్న ఈ వ్యవహారం హైకోర్టు, సుప్రీం కోర్టు, బెంచ్ ఇలా కోర్టుల్లో విచారణలు, వాయిదాల నేపథ్యంలో ఇది ఇప్పట్లో తేలుతుందా లేదా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో నలుగుతోంది.