న్యూఢిల్లీ: ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. న్యాయవ్యవస్ధ స్వతంత్రతపై దాడి జరుగతోందనీ, దానిని బలిపశువుగా మారనివ్వరాదనీ ఆయన అన్నారు.
సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగి ఒకరు జస్టిస్ గొగోయ్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నేపధ్యంలో కోర్టు స్పెషల్ బెంచ్ ఒకటి శనివారం అత్యవసర విచారణ చేపట్టింది. ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న ప్రధాన న్యాయమూర్తి, ఈ ఆరోపణలను ఖండించడం కూడా నా స్థాయి దిగజార్చుకున్నట్లే అంటూ, సీనియారిటీలో తర్వాతి స్థానంలో ఉన్న జస్టిస్ అరుణ్ మిశ్రా ఉత్తర్వులు ఇస్తారని చెప్పారు.
దీని వెనుక పెద్ద శక్తులు ఉండిఉంటాయనీ, ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం పని చేయకుండా చూడడం దీని లక్ష్యమనీ జస్టిస్ గొగోయ్ వ్యాఖ్యానించారు. వచ్చేవారం ముఖ్యమైన కేసులు విచారించాల్సి ఉండగా ఈ ఆరోపణలు వచ్చాయనీ, తాను మాత్రం ఇక్కడే కూర్చుని కేసులు వింటాననీ ఆయన అన్నారు. నాపై అవినీతి ఆరోపణలు లేవు కాబట్టి ఏదో ఒక ఆరోపణ వెదకాలి, ఇది దొరికింది అని జస్టిస్ గొగోయ్ అన్నారు.
న్యాయమూర్తిగా 20 ఏళ్లు నిస్వార్ధంగా సేవలు అందించిన తర్వాత నా బ్యాంక్ బ్యాలెన్స్ 6.80 లక్షల రూపాయలు. నా ప్యూన్ దగ్గర ఇంకా ఎక్కువ ఉంటాయి. 20 ఏళ్ల తర్వాత ప్రధాన న్యాయమూర్తికి దక్కే రివార్డు ఇదా అని జస్టిస్ గొగోయ్ ప్రశ్నించారు.
తనపై లైంగిక ఆరోపణలు చేసిన మహిళకు క్రిమినల్ నేపధ్యం ఉందనీ, ఆమెపై రెండు పోలీసు కేసులు ఉన్నాయనీ జస్టిస్ గొగోయ్ పేర్కొన్నారు. ఈ ఆరోపణలు బ్లాక్మెయిల్ వ్యవహారంలాగా ఉందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. జస్టిస్ గొగోయ్తో పాటు జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనంలో ఉన్నారు. ఇలాంటి నీతినియమాలు లేని ఆరోపణల వల్ల న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకం సడలిపోతుందని జస్టిస్ మిశ్రా వ్యాఖ్యానించారు.
ఉత్తర్వులు తర్వాత ఇస్తామని ధర్మాసనం పేర్కొన్నది. ఈ కేసులో సంయమనం పాటించి, బాధ్యతాయుతంగా వ్యవహరించే విషయాన్ని మీడియాకే వదిలిపెడుతున్నామని ధర్మాసనం పేర్కొన్నది.