మచిలీపట్నం వైసీపీ నేత పేర్ని నాని ప్రధాన అనుచరుడు మోకా భాస్కరరావు హత్య కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో పోలీసులు అతనిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. విశాఖపట్నం వైపు రవీంద్ర వెళుతుండగా తూర్పుగోదావరి జిల్లాలోని తుని మండలం సీతాపురం సమీపంలో అతనిని అదుపులోనికి తీసుకున్నారు.
ఇదిలా ఉండగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కొల్లు రవీంద్ర అరెస్ట్ పై తీవ్ర సందేహాలు వ్యక్తం చేశారు. కనీసం ప్రాథమిక విచారణ కూడా చేయకుండా కొల్లు రవీంద్ర ను అరెస్ట్ చేయడం వెనక వైసీపీ కుట్ర దాగుందని…. ఇది కక్షా సాధింపు అని చెప్పిన బాబు అసలు మఫ్టీ లో ఉన్న పోలీసులు ఆయన కారును ఆపి తనిఖీలు చేసే అధికారం ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
రవీంద్ర అరెస్టును తీవ్రంగా ఖండించిన చంద్రబాబు ప్రాథమిక విచారణ కూడా చేయకుండా ఉద్దేశపూర్వకంగానే ఈ కేసులో ఇరికించారని… బీసీలంటేనే వైసీపీ పగబట్టిందని చంద్రబాబు మండిపడ్డారు. రవీంద్ర కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడిన చంద్రబాబు వారికి ధైర్యం చెప్పారు. ఇక అచ్చెన్నాయుడు కేసు విషయంలో అతని లాయర్ ని మరియు కుటుంబ సభ్యులను గైడ్ చేస్తున్నట్లు చెప్పబడుతున్న టిడిపి హైకమాండ్ ఇప్పుడు రవీంద్ర కుటుంబ సభ్యులకు కూడా కొన్ని సూచనలు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తుంది.
అసలు పోలీసులు మఫ్టీలో కొల్లు రవీంద్రను మార్గం మధ్యలో ఆపడం ఏమిటి? అతని వాహనాన్ని తనిఖీలు చేయడం ఏమిటి? తనిఖీలు చేస్తున్నప్పుడు వారి దగ్గర సెర్చ్ వారెంట్ లేదని కొల్లు రవీంద్ర అనుచరులు చెబుతున్నారు. అదే నిజమైతే వైసిపి ఉద్దేశపూర్వకంగానే రవీంద్రను ఈ కేసులో ఇరికించింది అనే భావన ప్రజల్లో ఏర్పడుతుంది.
అంతేకాకుండా ఇప్పుడు అతను అరెస్టు అయిన 12 గంటల్లోనే ఇలా ఎవరో మఫ్తీ లో వచ్చి ఒక మాజీ మంత్రిని అరెస్ట్ పేరుతో విజయవాడ కు తీసుకొని వెళ్ళి పోలీసులకు అప్పగించారు అని చెప్పుకుంటున్నారు జనాలు. అసలు ఏపీ లో మఫ్టీ డ్యూటీలు ఎప్పటి నుంచి ప్రారంభం అయ్యాయని…. దీనికి వెనుక ఏదైనా కుట్ర ఉందా అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇక హత్యకు సంబంధించి కొల్లు రవీంద్ర ను అరెస్టు చేసిన తర్వాత జిల్లాకు చెందిన మరొక టిడిపి పేరు కూడా బయటకు వచ్చినట్లు సమాచారం. ఇక పోతే మరో టీడిపి నేత యనమల రామక్రిష్ణుడి అరెస్టు కూడా ఇప్పుడే ఉండవచ్చని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇక ఈ రెండు విషయాలు గమనిస్తే రాష్ట్రంలో మరో సెన్సేషన్ అవ్వడానికి ఎంతసేపు పట్టేలా లేదు.