కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను అందరం మాస్కులను ధరిస్తున్నాం. చాలా మంది తమకు అందుబాటులో ఉన్న, తమకు సౌకర్యంగా ఉండే భిన్న రకాల మాస్కులను ధరిస్తున్నారు. మాస్కులు లేని వారు కర్చీఫ్లను వాడుతున్నారు. అయితే ఇవేవీ సరిపోవు.. అనుకున్నాడో.. ఏమో.. తెలియదు కానీ.. ఆ వ్యక్తి మాత్రం ఏకంగా బంగారంతో మాస్కును తయారు చేయించుకుని దాన్నే నిత్యం ధరిస్తున్నాడు. అవును.. షాకింగ్ ఉన్నా.. ఇది నిజమే..
పూణెలోని పింప్రి చించ్వాడ్లో నివాసం ఉండే శంకర్ కురాడే అనే వ్యక్తి ఏకంగా బంగారంతో ఓ మాస్కు తయారు చేయించుకున్నాడు. దాని విలువ అక్షరాల రూ.2.89 లక్షలు. ఆ క్రమంలో ఆ గోల్డ్ మాస్క్ను అతను నిత్యం ధరిస్తూ ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు. ప్రస్తుతం ఇతనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే గోల్డ్ మాస్క్ అంటున్నారు.. మరి దాన్ని ధరిస్తే గాలి ఎలా తగుతుంది ? అని సందేహం రావచ్చు. కానీ ఆ మాస్క్పై చిన్నపాటి రంధ్రాలు ఉంటాయి. దీంతో ఆ మాస్క్ చేపల వల మాదిరిగా మనకు కనిపిస్తుంది. అందువల్ల దాన్ని ధరించినా గాలి ఆడుతుంది. సమస్య ఉండదు. దీనిపై శంకర్ను ప్రశ్నించగా.. గోల్డ్ మాస్క్ను ధరించడం వల్ల తనకు శ్వాస పరంగా ఎలాంటి ఇబ్బందులు కలగడం లేదని, కొద్ది రోజుల నుంచి ఈ మాస్క్ను ధరిస్తున్నానని చెప్పాడు. అయితే కేవలం ఫ్యాషన్ కోసమే ఈ మాస్క్ను అతను ధరించి ఉంటాడని తెలుస్తోంది. ఏది ఏమైనా.. మీరు ఇలాంటి ఖరీదైన ఐడియాల జోలికి వెళ్లకండి. మాస్క్ ఏదైనా అదిచ్చే ప్రొటెక్షన్ అది ఇస్తుంది. అంతమాత్రానికి అంత ఖరీదైన మాస్కులను ధరించాల్సిన అవసరం లేదు. ఏ మాస్కూ లేకపోతే కనీసం కర్చీఫ్ కట్టుకున్నా చాలు.. కరోనా రాకుండా జాగ్రత్త పడవచ్చు.