ఢిల్లీ, ఫిబ్రపరి 4: ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితాలో భారీ స్థాయిలో అవకతవకలు చోటుచేసుకున్నాయని వైసిపి అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహనరెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సోమవారం ఆయన పార్టీ నాయకులను వెంట తీసుకుని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరాను కలిశారు. రాష్ట్రంలో అప్రజాస్వామిక రీతిలో అధికార తెలుగుదేశం పార్టీ ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడిందని చెప్పారు.
అధికార యంత్రాంగాన్ని, పోలీసు వ్యవస్థను టిడిపి ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నదని జగన్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. పార్టీ ఫిరాయింపుల అంశాలను కూడా ప్రస్తావించారు. సర్వేల పేరుతో టిడిపి వ్యతిరేక ఓటర్లను జాబితా నుండి తొలగిస్తున్నారని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి (సిఈసి) సునీల్ అరోరాకు ఫిర్యాదు చేస్తూ కొన్ని ఆధారాలను సమర్పించినట్లు జగన్ మీడియాకు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలంటే ప్రధానంగా డిజిపి ఠాకూర్, ఇంటలిజెన్స్ అడిషనల్ డిజి ఎబి వెంకటేశ్వరరావు, డిఐజి (శాంతి భద్రతలు) ఘట్టమనేని శ్రీనివాస్లను ఎన్నికల విధుల నుండి తప్పించాలని సిఇసిని కోరినట్లు తెలిపారు.
రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం దగాకోరు విధానాలను అవలంబిస్తున్నదని విమర్శించారు.
చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన 35మంది సిఐలకు ప్రమోషన్లు ఇచ్చారని అన్నారు.
నకిలీ, బోగస్ ఓట్లు తొలగించాలని కోరామని చెప్పారు.
రాష్ట్రంలో 60లక్షల బోగస్ ఓట్లు ఉన్నాయని, వీటిలో 20లక్షల ఓట్లు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్లలో రెండు చోట్ల ఉండగా 40లక్షల ఓట్లు ఆంధ్రరాష్ట్రంలోనే రెండు చోట్ల ఉన్నాయని జగన్ అన్నారు. ఈ నకిలీ ఓట్లు తొలగించడంతో పాటు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఒకే రోజు ఎన్నికలు జరిగేలా చూడాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్లు చెప్పారు.
ప్రజా సాధికార సర్వే, రియల్ టైమ్ గవర్నెన్స్ తదితర సర్వేల పేరుతో వైసిపికి అనుకూలంగా ఉన్న సుమారు 4లక్షల ఓట్లు తొలగించారని జగన్ ఆరోపించారు.
ఇవిఎంలతో ఏదో జరిగిపోతుందని గగ్గోలు పెడుతున్న చంద్రబాబు 2014 ఎన్నికల్లో ట్యాంపరింగ్ చేసే గెలిచారా అని జగన్ ప్రశ్నించారు. ‘మా పార్టీ మీద ఒక శాతం ఓట్ల తేడాతో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలిచిందని’ జగన్ అన్నారు.
ఇటీవల నాలుగు రాష్ట్రాల ఎన్నికలు చూశాం. మూడు రాష్ట్రాల్లో బిజెపి ఓడిపోయింది, కాంగ్రెస్ గెలిచింది, నిజంగా ట్యాంపరింగ్ జరిగి ఉంటే ఆ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయి అధికార బిజెపి గెలిచేది కదా అని జగన్ ప్రశ్నించారు. ఏది మాట్లాడినా లాజిక్ అనేది ఉండాలని జగన్ అన్నారు.
ఎలాగూ ఓడిపోతున్నామని తెలుసుకాబట్టి ఆ నెపాన్ని ఈవిఎంలపై వేయాలని చంద్రబాబు చూస్తున్నారని జగన్ ఎద్దేవా చేశారు.