తెలంగాణలో ఇప్పుడు హాట్ హాట్ రాజకీయాలు, నిర్ణయాలు జరుగుతున్నాయి. అదే సమయంలో అధికార – ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.
ప్రధానంగా కొత్త రెవెన్యూ చట్టం కేంద్రంగా అయితే, విమర్శల పరపంర కొనసాగుతోంది. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ నేత, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ, కీలక వ్యాఖ్యలు చేశారు.
బ్రిటీష్ వాళ్ల సమయంలో…
తెలంగాణ రాకముందు, గడిచిన 70 ఏళ్ళు నీళ్లు-నిధులు-కరెంట్ లేక ప్రజలు పడ్డ బాధలు మనం చూశామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రజలు ఆశించిన పాలన జరగలేదని తలసాని ఆరోపించారు. బ్రిటిష్-నైజాం కాలంలో ఉన్న రెవెన్యూ చట్టం వల్ల ప్రజల్లో ఎప్పుడూ ఏదో సమస్య ఉండేదని తెలిపారు. 7 దశాబ్దాల కాలం నుంచి వస్తున్న బాధ కొత్త రెవెన్యూ చట్టంతో తొలిగిపోతుందని ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారని తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.
పాలకులు మారితేనే…
ప్రభుత్వాలు-నాయకులు మారినా యంత్రాంగం మాత్రమే మారదని అది నాయకుల చిత్తశుద్ధిని బట్టి ఉంటుందని తలసాని చెప్పుకొచ్చారు. “దేశ రాష్ట్ర రాజకీయ అంచనాలను తారుమారు చేసి రెండోసారి అధికారం తెచ్చిన ఘనత కేసీఆర్ది. కొత్త రెవెన్యూ చట్టం గొప్పగా ఉంది కాబట్టే ప్రతిపక్షాలు సైతం ఒప్పుకోక తప్పలేదు. జీవో 58 తెచ్చి గ్రేటర్ ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం తెలంగాణ సీఎం కేసీఆర్ చూపించారు. పల్లె ప్రగతి కార్యక్రమంతో తెలంగాణ ప్రజలకు గ్రామ స్వరాజ్యం తెచ్చిన ఘనత దేశంలో ఒక్క కేసీఆర్ కు మాత్రమే దక్కుతుంది. కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా ఉండటం హైదరాబాద్ ప్రజల అదృష్టం. హైదరాబాద్లో మెట్రో రైల్కు కాంగ్రెస్ అనుమతి ఇచ్చినా దాన్ని పూర్తి చేసిన ఘనత టీఆరెస్ ప్రభుత్వానిది. సైబరాబాద్లో ఉన్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ చుస్తే స్విట్జర్ ల్యాండ్ లో ఉన్నట్లు అనిపిస్తుంది.“ అని తలసాని చెప్పుకొచ్చారు.
కేసీఆర్ యుగపురుడు…
కోవిడ్ సమయంలో గాంధీ హాస్పిటల్ తప్ప వేరే హాస్పిటల్ లేదని చెప్పిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ విషయాన్ని పక్కన పెట్టి గాంధీ ఆస్పత్రిపై తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. “ఆరోగ్య శ్రీ ముందు ఆయుష్మాన్ భారత్ పనికిరాదు. కేంద్ర బృందాలు సైతం కరొనా విషయంలో తెలంగాణ ప్రభుత్వ పనితీరును మెచ్చుకున్నాయి. పీపీఈ కిట్లు దాపెట్టుకున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాటలు వింటే నోవ్వొస్తుంది.“ అని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో కాళేశ్వరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే సినిమా అన్నారు కానీ ఇవ్వాళ సినిమా నిజం అయింది అని తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. రెవెన్యూ చట్టం ద్వారా చరిత్రలో కేసీఆర్ పేరు సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది అని తలసాని చెప్పారు. “ప్రతి యుగానికి ఒకరు పుడతారు అతనే యుగపురుషుడు అవుతారు..ఆయనే కేసీఆర్.“ అని తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పుకొచ్చారు.